కరోనా దెబ్బకు వినోదరంగం అతలాకుతలమై, థియేటర్ల వ్యవస్థను దెబ్బ తీసినా.. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ లకు మాత్రం బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎప్పుడైతే ఈ పరిస్థితి దాపురించిందో అప్పటినుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ లు విశేషంగా జనంలోకి చొచ్చుకొని పోయాయి.
అందుకే జనం కూడా స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీలోనే విడుదలవ్వాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా కొత్త కొత్త వెబ్ సిరీస్ లను కూడా ఎంతో ఇష్టంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లు జనంలోకి బాగా చొచ్చుకొని వెళ్లాయి. వెలుతున్నాయికూడా! అందుకే కొందరు హీరోహీరోయిన్లు కూడా డిజిటల్ సినిమాల్లో నటించడానికి తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఎంతో మంచి పరిణామమేనని ఇండస్ట్రీ కి చెందిన కొందరు ముఖ్యులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో అయితే తెలుగు – తమిళంలో ఒకేసారి ఓ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి రెడీ అవుతున్నారట. క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు, మరో ఇద్దరు హీరోయిన్ లు వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పారట.ఆ ఇద్దరు ఎవరో.. అనేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నా. అందులో ఒకరు టాలెంటెడ్ బ్యూటీ నభా నటేష్ కాగా, మరొకరు అంజలి.
ఈ ముగ్గురి కలయికలో ఓ ప్రముఖ సంస్థ ఈ సిరీస్ చేస్తున్నారని తెలిసింది. ఇది ఒక ఎమోషనల్ సిరీస్ అని, మెయిన్ గా ముగ్గురి హీరోయిన్ల పాత్రల మధ్య వచ్చే రివేంజ్ సీన్సు కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి కథాబలం ఉన్న వెబ్ సిరీస్ స్టోరీలో నటిస్తేనే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ టాప్ హీరోయిన్లు ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించారని కూడా తెలుగు – తమిళ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ క్రేజీ భామలు వీటిపై ఆసక్తి చూపించడం వెనుక ఓ అగ్ర హీరో హస్తం ఉన్నట్లు టాలీవుడ్ – కోలీవుడ్ రంగాలు చెప్పుకుంటున్నాయి.