బీజేపీలో పార్టీ పదవులు కానీ, ప్రభుత్వ పదవులు కానీ రావాలంటే వారికి ఆరెస్సెస్ నేపధ్యం, హిందూ భావజాలం లాంటి కొన్ని అర్హతలు కచ్చితంగా ఉండాలి అని, బీజేపీ ఒక విభిన్నమైన రాజకీయ పార్టీ అని నమ్మే నాలాంటి అనేకమందికి నిన్న బీజేపీ ప్రకటించిన కార్యవర్గ జాబితా చూసి కనువిప్పు కలిగింది. బీజేపీ కూడా రాజకీయ లబ్దికోసం, ఎన్నికల్లో విజయాలకు తన సహజ సిద్ధాంతాలకు, భావజాలానికి దూరంగా జరుగుతున్నది అని సంకేతాలు అయితే వెలువడుతున్నాయి.

విలువలను దిగజార్చుకున్న బీజేపీ
గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన తరువాత తెలుగుదేశం పార్టీనుంచి ఆర్ధిక ఉగ్రవాదులుగా ముద్రపడి, అనేక ఆర్థికనేరాల కేసుల మీద సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతో వేటాడబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరుడుగట్టిన చంద్రబాబు భక్తులు ముగ్గురు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన మరొక రాజ్యసభ సభ్యుడిని తన కౌగిట్లో బిగియారా బంధించిన వైనాన్ని చూసి దిగ్భ్రమ చెందాల్సి వచ్చింది. కేవలం ఒకే ఒక్క ఓటును కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చెయ్యడానికి ఇష్టపడని వాజపేయి, తన మీద హవాలా ఆరోపణలు రాగానే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అద్వానీ లాంటి మహానుభావులు నడిపిన బీజేపీకి, అన్ని విధాలా భ్రష్టుపట్టిన కాంగ్రెస్ పార్టీకి తేడా ఏమీ కనిపించలేదు. ఇక తెలుగుదేశం పార్టీతో నాలుగేళ్లు అంటకాగి, పాకేజిరాయుడుగా, చంద్రబాబు బానిస అనిపించుకుని, బీజేపీ నాయకుల మీద నోరు పారేసుకున్న పవన్ కళ్యాణ్ తో ఒక్క నిముషంలో మైత్రి కుదుర్చుకున్న దృశ్యం చూసి చేష్టలుడిగి పోవాల్సివచ్చింది. నైతిక విలువలను బీజేపీ నేలరాసింది అని సామాన్యుడికి కూడా అర్ధమైంది.
ఏమిటి వీరి సేవలు?
తాజాగా పునర్వ్యవస్థీకరించిన పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి డీకే అరుణ, ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి ఊహించని విధంగా జాతీయస్థాయిలో పదవులు దక్కాయి. వీరికి పదవులు రావడంలో వింత లేదు కానీ, ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చిరకాలం పనిచేసి మంత్రి పదవులు అనుభవించి, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ లాంటి వారిని చేర్చుకోగా లేనిది పురందేశ్వరిని చేర్చుకుంటే అది తప్పు పట్టాల్సిన విషయం కాదు. కానీ, వీరిని కేవలం వారి సామాజికవర్గ నేపధ్యం చూసి మాత్రమే పదవులు ఇచ్చారు. వీరు బీజేపీకి చేసిన సేవ, పార్టీ నిర్మాణాన్ని వ్యాప్తిచేయడంలో భాగస్వామ్యం ఏమీ లేవు.
పదవులకు అర్హత కులమేనా?
ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయస్థాయి పదవి ఒక్క పురందేశ్వరికి మాత్రమే దక్కింది. జీవీల్ నరసింహారావును తొలగించారు. బహుశా ఆయనకు భవిష్యత్తులో ఏదైనా పెద్ద పదవి ఇస్తారేమో తెలియదు. అనేక దశాబ్దాలపాటు బీజేపీకి అండగా నిలబడుతున్న బ్రాహ్మణా సామాజికవర్గానికి చెందిన జీవీఎల్ ను తొలగించి, బీజేపీని నరనరానా ద్వేషించే కమ్మ సామాజికవర్గానికి చెందిన పురందేశ్వరికి పదవి ఇవ్వడం ద్వారా ఎలాంటి సందేశాన్ని పంపించదలచుకున్నది బీజేపీ? కమ్మ సామాజికవర్గం వారు ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీనే అభిమానిస్తారు. బ్రాహ్మణుల ఓట్లు అవసరం లేదని బీజేపీ నిర్ణయించుకుందా? చాలాకాలంగా బీజేపీలో పనిచేస్తున్న ఐ వై ఆర్ కృష్ణారావుగారికి ఏదైనా పదవి ఇవ్వాలని అనిపించలేదా? ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన అనుభవజ్ఞుడు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి హోదాలో పనిచేశారు. అవినీతి మచ్చలు లేవు. పురందేశ్వరిని పదవితో సత్కరించినంతమాత్రాన కమ్మ కులస్తులు బీజేపీ వైపు మొగ్గు చూపుతారని అధిష్టానం ఎలా విశ్వసించిందో ఆశ్చర్యం! తన సామాజికవర్గం మీద ఆమెకు ఎలాంటి కమాండ్ లేదు. మొన్న విశాఖపట్నంలో ఆమె పోటీ చేసినపుడు, అంతకుముందు ఎన్నికల్లో రాజంపేటలో పోటీ చేసినపుడు ఆమెకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆమె ప్రతిభను గౌరవించి పదవి ఇచ్చామంటే మాత్రం అంగీకరించవచ్చు.
అమరావతీ ఒక్కటే దేనికి?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మూడు రాజధానుల రగడ నడుస్తున్నది. కోర్టులో విచారణ జరుగుతున్నది. రాజధానులు ఎన్నికావాలో, ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం, హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లు కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. అలాంటి నేపధ్యాన్ని విస్మరించి “అమరావతిలోనే రాజధాని ఉండాలనేది మా అభిమతం” అంటూ ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురందేశ్వరి పేర్కొనడంలో ఏమైనా విజ్ఞత కనిపిస్తున్నదా? అమరావతి అనేదాన్ని ఎవరు నిర్ణయించారు? చంద్రబాబు నిర్ణయించినంతమాత్రాన అదే రాజధాని అవుతుందా? రాజధాని వికేంద్రీకరణకు ప్రభుత్వం కృతనిశ్చయురాలై ఉన్నదని తెలిసిన తరువాత కూడా అమరావతి లోనే రాజధాని ఉండాలనటం చెప్పడం ఆమె ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారని భావించాలి? బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు వంత పాడటం ఏమిటి? 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటున్నది. అందులో తప్పు లేదు. అధికారంలోకి రావాలనుకునేవారు రాష్ట్రం మొత్తాన్ని సమభావంతో చూడాలి. అన్ని ప్రాంతాల మనోభావాలను గౌరవించాలి. రాయలసీమలో హైకోర్టు ఉండాలన్నది బీజేపీ తీర్మానం కాదా? ఆ తీర్మానం చేసినపుడు ఆమె బీజేపీలోనే ఉన్నారు కదా? ఆ తీర్మానాన్ని అలక్ష్యం చేస్తూ అమరావతిలోనే రాజధాని ఉండాలనటం ఆ తీర్మానానికి ద్రోహం కాదా?
ఆలోచనారహితమైన మాటలు!
గత ఎన్నికల సమయంలో భర్తతో పాటు ఆమె కూడా వైసిపిలో చేరిఉన్నట్లయితే విజయవాడ ఎంపీగా గెలిచి ఉండేవారు అంటారు ఆ జిల్లా వారు. ఎన్టీఆర్ కుమార్తె కావడం, అవినీతి మరకలు లేకపోవడం దానికి తోడు వైసిపి గాలి వీచడంతో కచ్చితంగా గెలిచి ఉండేవారు. కానీ దురదృష్టం కొద్దీ బీజేపీని వీడలేక తన రాజకీయ భవిష్యత్తును తానే సమాధి చేసుకుని విశాఖపట్నంలో పోటీ చేసారు. అక్కడ ఆమెకు ధరావతు కూడా రాలేదు. ఆ కోపం ఆమెలో ఉన్నదో ఏమో….ఉత్తరాంధ్రకు ఆగ్రహం వస్తుందని తెలిసి కూడా అమరావతికి మద్దతు పలుకుతున్నారు! రాయలసీమకు, తన తండ్రికి, తమ్ముడికి ఉన్న అనుబంధం ఆమెకు తెలియదా? ఎన్టీఆర్ ను ఒకసారి, బాలకృష్ణను రెండుసార్లు గెలిపించిన రాయలసీమకు వెన్నుపోటు పొడవడం వివేకమేనా? తన సామాజికవర్గం వారి ఆధిక్యత కలిగిన అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పడం ద్వారా ఆమె వలన బీజేపీకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడే తేటతెల్లమైంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు
