అమ్మ చెప్పిందంటే సమంత ఇంకో సంచలనం.!

నాగచైతన్యతో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ప్రకటన వెలువడించాక.. సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూనే వుంది. సమంతని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు, ఇంకొందరు ఆమెకు అండగా నిలుస్తున్నారు. వ్యక్తిగత జీవితంపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ అను నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూనే వుంది సమంత.

అయితే, ఇంతవరకు అక్కినేని నాగచైతన్య ఈ వ్యవహారాలపై స్పందించలేదు. స్పందించే ఆలోచన కూడా ఆయనకున్నట్లు కనిపించడంలేదు. ఇరువురం కలిసి విడాకులపై నిర్ణయం తీసుకున్నట్లు, విడాకుల ప్రకటన చేయడం తప్ప, చైతూ.. అంతకు మించి ఆ తర్వాత ఏమీ చెప్పలేదు నేరుగా గానీ, సోషల్ మీడియా వేదికగా గానీ.

సమంత మాత్రం, తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే వుంది. తాజా పోస్టులో ‘అమ్మ చెప్పింది’ అంటూ, తన ధైర్యం గురించి పేర్కొంది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘నేను బలవంతురాలిని.. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొనగలను..’ అన్నది ఆ పోస్ట్ సారాంశం.

మామూలుగా అయితే, దీన్ని బూతద్దంలో చూడాల్సిన పనిలేదు. సమంత సహజంగా పెట్టే సాధారణ పోస్టుల్లానే చూడాలి. కానీ, సోషల్ మీడియాలో కనిపిస్తున్న నెగెటివిటీ నేపథ్యంలో సమంత నుంచి వచ్చేు ప్రతి పోస్టుకీ మీడియాలో హైప్ కనిపిస్తోంది.

తాను పోస్టు పెడితే, వచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసుకోనంత అమాయకురాలైతే కాదు సమంత. తెలిసే ఇదంతా సమంత చేస్తోందా.? అయితే, ఎందుకు.? ఆమె ఏం ఆశిస్తోంది.? అన్నది చర్చనీయాంశంగా మారింది.

‘మరీ సమంత పోస్టుల్ని తరచి చూడటం అనవసరం.. లోతైన అర్థాలు వెతకడం అంతకన్నా అనవసరం..’ అంటున్నారు కొందరు నెటిజన్లు. కానీ, చాలామంది నెటిజన్లు.. సమంత తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా సమంత వివాదాలకు తావిస్తోందనే అభిప్రాయపడుతున్నారు.