మ‌హేష్‌ ,ర‌ణ్‌వీర్ వైర‌ల్ పిక్.. ఒకరిపై ఒక‌రు ప్రేమ‌లు కురిపించుకుంటూ ట్వీట్స్

ఒక‌ప్పుడు ఆన్ స్క్రీన్ కాని, ఆఫ్ స్క్రీన్ కాని ఇద్ద‌రు హీరోలు క‌లిసి క‌నిపించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. కాని ఇప్పుడు హీరోల మ‌ధ్య బాండింగ్ ఎక్కువ కావ‌డ‌మే కాదు క‌లిసి పార్టీలు చేసుకోవ‌డం, ఒక‌రి ప్రీ రిలీజ్ వేడుక‌కు ఒక‌రు గెస్ట్‌లుగా వెళ్ళడం, లేదంటే క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డం వంటివి చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ క‌లిసి ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

తెలుగు సినిమా స్థాయి పెర‌గ‌డంతో బాలీవుడ్ స్టార్స్ కూడా టాలీవుడ్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఇందులో భాగంగా అజ‌య్ దేవ‌గ‌ణ్ వంటి స్టార్ ఆర్ఆర్ఆర్ లో న‌టిస్తుండ‌గా, సంజ‌య్ దత్ కేజీఎఫ్‌లో, సైఫ్ అలీఖాన్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్పుడు మహేశ్‌ బాబు, బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కలిసి ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫొటోని మ‌హేష్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మీతో ప‌నిచేయ‌డం గొప్ప అనుభూతిని ఇచ్చింద‌ని పేర్కొన్నారు. అదే ఫొటోని రణ్‌వీర్ కూడా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..నాకు ప‌రిచ‌యం అయిన వారిలో ఫైనెస్ట్ జెంటిల్‌మెన్ అయిన మ‌హేష్‌ని క‌ల‌వ‌డం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. నా బిగ్ బ్ర‌ద‌ర్ మ‌హేష్‌పై నా ప్రేమ‌, గౌర‌వం ఎప్పుడు ఉంటాయి అని పేర్కొన్నారు.

రణ్‌వీర్‌ ప్రస్తుతం ‘సర్కస్‘‌ సినిమాలో నటిస్తుండ‌గా, ఈ చిత్రాన్ని రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ’83’లోనూ ర‌ణ్‌వీర్ న‌టించ‌గా, ఈ సినిమా త్వర‌లోనే విడుద‌ల కానుంది . ఇక మిల్కీబాయ్‌ మహేశ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళితో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మాస్ క్యారెక్ట‌ర్‌లో ఓ సినిమా చేయ‌నున్నారు