జోరు పెంచిన కైరా అద్వానీ: అసలు సీక్రెట్ ఇదే

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన కైరా అద్వానీ, ఆ తర్వాత తెలుగు సినిమా వైపు కన్నెత్తి చూడలేదు. హిందీలో దాదాపు డజను సినిమాల్ని ఒకేసారి ఓకే చేయడమే అందుకు కారణం. అయినా కానీ, ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల తర్వాత ఇప్పటిదాకా, తెలుగులో కనీసం ఒక్క సినిమా కూడా ఆమె చేయకపోవడం ఆశ్చర్యకరమే.

ఏమైందో కానీ, కైరా అద్వానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని తెలుగుతో పాటు, తమిళంలోనూ చేసేయబోతోందిప్పుడు. చరణ్ – శంకర్ కాంబోలో వస్తోన్న మెగా ప్రాజెక్టులోకి కైరా అద్వానీని తీసుకున్నారు. విజయ్ – వంశీ పైడిపల్లి సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకోబోతున్నారట. ఇవి కాక, మరో మూడు తెలుగు సినిమాలు ఆమె చేయబోతోందని అంటున్నారు.

ఇంతకీ కైరా అద్వానీలో ఇంత మార్పు ఎలా వచ్చింది.? దక్షిణాది సినిమాల్లో నటించడానికి టైమ్ లేదు అని తప్పించుకున్న కైరా అద్వానీ, ఇప్పుడు ఇంతలా ఖాళీ చూసుకుని సౌత్ సినిమాలపై ఎందుకు ఫోకస్ పెట్టినట్లు.? ఆరా తీస్తే, కరోనా తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆమె గతంలో కమిట్ అయిన కొన్ని హిందీ సినిమాలు ఆగిపోయాయని తెలుస్తోంది.