బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ సారి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో పాటు ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఇద్దరినీ ఏకి పారేసింది. వారిపై కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాక కంగనా విమర్శలు చేస్తూనే ఉంది. ఆమె చేసిన ఆరోపణలతో బాలీవుడ్ తో పాటు మహారాష్ట్ర ప్రజలు షాక్ అవుతూనే ఉన్నారు. మరో వైపు బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన నటి (సుశాంత్ మాజీ లవర్) అయిన రియా డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. మరో వైపు రకుల్ ప్రీత్ , దీపికా పదుకొనే,సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ లకి కూడా నోటీసులు అందాయి.

సుశాంత్ విషయమై చెలరేగిన వివాదంలో ఇది వరకే సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే తో వివాదానికి దిగిన కంగనా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ ఈ దేశంలోనే అసమర్థ సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది ఉద్దవ్ థాక్రేనే.. ఆయనను ఎవరూ ప్రశ్నించొద్దా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎంత నీచుడో ఏకంగా నటి పాయల్ ఘోష్ చెప్పింది. అయినా అనురాగ్ కశ్యప్ సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నాడు. తప్పు ఒప్పుకొని క్షమాపణలు కోరకుండా బరితెగించి మాట్లాడుతున్నాడు. హరియాణాకు చెందిన యూట్యూబర్ సాహిల్ చౌదరి మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇదెక్కడి న్యాయం. ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడటం కూడా తప్పేనా?’ అంటూ కంగనా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.
