ఈ స్టార్ యాక్ట‌ర్‌కు శిలువ‌లేశారేంటి?.. ఇదెక్క‌డి దారుణం అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు జ‌గ‌ప‌తి బాబు. 90ల స‌మ‌యంలో జ‌గ‌ప‌తిబాబు న‌టించిన సినిమాలు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో వినోదాన్ని పంచాయి. శుభ‌ల‌గ్నం చిత్రంలో ఇద్ద‌రి పెళ్ళాల మ‌ధ్య న‌లిగే భ‌ర్త‌గా జ‌గ‌ప‌తిబాబు న‌టించి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న జ‌గ‌ప‌తి బాబు మ‌ళ్లీ లెజెండ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయ‌న నెగెటివ్ రోల్‌లో అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచి మంచి పేరు తెచ్చుకున్నారు.

హీరోగానే కాకుండా, విలన్ పాత్రలో కూడా తనదైన మార్క్‏ను చూపించిన జ‌గ‌ప‌తి బాబు ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం డైరెక్టర్ విద్యాసాగర్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో కార్తీక్, అమ్ము అభిరామి యంగ్ కపుల్ పాత్రలో నటిస్తున్నారు. ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్‏గా రూపొందిన ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్నారు.

ఎఫ్‌సీయూకే చిత్రానికి బీమ్స్ సెసిరొలియా సంగీతాన్ని అందిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టు సహశ్రిత ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం. ఈ సినిమా ముఖ్యంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందని, సినిమాలోని భావోద్వేగాలు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది. జ‌గ‌ప‌తి బాబు తండ్రి పాత్ర‌లో క‌నిపించి సందడి చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే జ‌గ్గూభాయ్ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ ఫొటో షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఇందులో చేతుల‌కు శిలువ‌, నెత్తిన ముళ్ల కిరీటం, ఒంటిపైన ర‌క్తం, ఈడ్చుకుపోయిన పొట్ట‌తో క‌నిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్‌కు జ‌గ‌ప‌తిబాబు ఎలాంటి కామెంట్ రాయ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీనిపై జ‌గ‌ప‌తి బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.