కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ సన్నివేశం అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల అన్ని పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. కోట్లాది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇలాంటి టైమ్ లో నిల్వ ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టాలంటే ఏది సేఫ్? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. భారతదేశంలో మదుపరులు బంగారంపై పెట్టుబడికి ఆసక్తి చూపుతారు. ప్రపంచ దేశాల్లో ఇదే పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఆ క్రమంలోనే బంగారంకి గిరాకీ పెరిగే వీలుంది. అయితే మార్కెట్ల అలజడి వల్ల బంగారం ధరల్లోనూ ఒడిదుడుకులు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే పలువురు విశ్లేషకుల అంచనా ప్రకారం.. బంగారం ధర అంతకంతకు పెరిగే ఛాన్సుందని వినిపిస్తోంది.
ప్రస్తుతం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,600కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 ఎగసింది. తులం ధర రూ.43,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు దిగొచ్చి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,250కి క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,500కి దిగొచ్చింది. ఓవరాల్ గా ఒడిదుడుకులు పరిశీలిస్తే.. లాక్ డౌన్ ముందు 10 గ్రాములు సుమారు 38 వేల మార్కులో ఉండేది. ఇప్పటికే 5-6 వేలు పెరిగింది. రూ.45 వేల వరకూ వెళుతోంది. 10 గ్రాముల బంగారం ధర మునుముందు రూ.55 వేల వరకూ పెరిగే ఛాన్సుందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్ల ఒడిదుడుకులు వల్ల బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇది అమాంతం ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
బంగారం ధరల్ని ప్రభావితం చేసే కారణాలేవి? అంటే.. ఆభరణాల తయారీ దారుల వద్ద విక్రయాలు.. సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు.. దేశీయ మార్కెట్లో డిమాండ్.. అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర సహా చాలా విషయాలు బంగారం- వెండి ధరల్ని ప్రభావితం చూపిస్తుంటాయి. ప్రస్తుతానికి బులియన్ మార్కెట్ సహా అన్నిచోట్లా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే సుదీర్ఘ కాలంలో బంగారం డిమాండ్ పెరుగుతుందని ధరలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇండియాలో పెళ్లిల్లు వాయిదా పడి అన్నీ గంపగుత్తగా ఒకేసారి చేయాల్సి వస్తే అప్పుడు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. అది కూడా ప్రభావితం చేయొచ్చు. అలాగే ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డీ ఈటీఎఫ్ (స్టాక్స్ మార్కెట్) లపై పెట్టుబడులు కలిసొస్తాయని నిపుణులు చెబుతున్నారు.
