ఎఫ్ 3లో మెగా హీరో.. అనీల్ రావిపూడి కామెంట్స్‌తో వ‌చ్చిన పూర్తి క్లారిటీ

2019 సంక్రాంతి బ‌రిలో నిలిచి ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ ఎఫ్ 2. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ప‌సందైన వినోదాన్ని అందించింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించిన చిత్రం ప్ర‌తి ముఖంపై న‌వ్వుల చిరుజిల్లు కూడా కురిపించింది. చిన్నా, పేదా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ మూవీని ఎంజాయ్ చేశారు. చిత్రంలోని డైలాగ్స్ కొన్ని ఇప్ప‌టికీ అంద‌రి నోళ్ళ‌ల్లో నానుతూనే ఉన్నాయి.

ఎఫ్‌2 చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఎఫ్ 3 సినిమాను ఇటీవ‌ల మొద‌లు పెట్టారు అనీల్ రావిపూడి. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. భార్యల మనస్తత్వం వల్ల కుటుంబంలో ఎలాంటి గొడవలు జరుగుతాయో ఎఫ్-2లో చూపిస్తే.. ‘ఎఫ్ 3’లో డబ్బు వల్ల ఫ్యామిలీలో ఎదురయ్యే సమస్యలను చూపించబోతున్నారు. ఈ విష‌యం కాన్సెప్ట్ పోస్ట‌ర్ ద్వారా క్లియ‌ర్‌గా అర్ధ‌మైంది. అయితే ఎఫ్ 3 టైటిల్‌ని బ‌ట్టి ఈ సినిమాలో ముగ్గురు హీరోస్ ఉంటార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ర‌వితేజ‌, మ‌హేష్ బాబు, గోపిచంద్‌ ల‌లో ఒక‌రు ఎఫ్ 3లో న‌టిస్తార‌ని అప్ప‌ట్లో ప్రచారం జ‌ర‌గగా, దానిని అనీల్ రావిపూడి ఖండించారు. తాజాగా మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నాడ‌ని గాసిప్స్ పుట్టించారు. దీనిపై స్పందించిన అనీల్ రావిపూడి ఎఫ్ 3లో మూడో హీరో ఉండ‌డ‌ని బ‌ల్ల‌గుద్ధి చెప్పాడు. త‌న‌కు మూడో హీరో ఆలోచ‌నే లేద‌ని కేవ‌లం ఇద్ద‌రు హీరోల‌తోనే సినిమా అంతా న‌డిపిస్తాన‌ని అన్నాడు. దీంతో పుకార్ల‌కు పులిస్టాప్ ప‌డ్డ‌ట్టు అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.స‌మ్మ‌ర్‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.