ఇంటి యజమాని సక్రమంగా లేకపొతే ఆ కుటుంబంలోని సభ్యుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోతుంది.. బ్రతుకులు రోడ్డున పడిపోతాయి! అదేవిధంగా… నాయకుడు సరైనోడు కాకపోతే.. పాలకుడు సమర్ధుడు అవ్వకపోతే.. కోట్ల మందిని పాలించే వ్యక్తికి ప్రజాసమస్యల కంటే తన వ్యక్తిగత స్వార్థప్రయోజనాలే ముఖ్యమైతే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది! ఈ నేపథ్యంలో.. దీనికి తాజాగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఉదాహరణగా తీసుకోవచ్చనే చర్చ మొదలైంది!
అవును… దేశంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో ఇంధన సమస్యలు తీవ్రమయ్యాయి. రెండు మూడు రోజులుగా సమస్య ఉన్నప్పటికీ… దానికి సంబంధించిన సమస్యల తీవ్రతపై ప్రభుత్వాధినేతకు అవగాహన లేకపోవడమో, ముందు చూపు కొరవడటమో, లేక.. వైసీపీ అధినేత జగన్ ఆరోపించినట్లు.. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడమో… కారణం ఏదైనా కామన్ మ్యాన్ నలిగిపోతున్నాడు!
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ కొరత గురించి ఆదివారం నాడు అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సోమవారానికి రాష్ట్రానికి పెట్రోలు, డీజిల్ సరఫరా పెరిగేలా చూడాలని, ఏ షాపు వద్ద కూడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. కట్ చేస్తే… సోమవారం కూడా అదే పరిస్థితి కనిపించగా.. మంగళవారమూ కంటిన్యూ అయ్యింది! బంకుల వద్ద వాహనదారుల క్యూలు దర్శనమిచ్చాయి!
రబీలో సుమారు 23 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. ఆ పంట కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ కోతల వేళ యంత్రాల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వరిలో కోతలు, కుప్ప నూర్పుళ్లు, రవాణాకు అవసరమైన డీజిల్ కొరత కారణంగా అద్దెకు తెచ్చిన కోత యంత్రాలు పొలాల్లోకి దిగలేని పరిస్థితి. దీంతో… కోతలు ఆలస్యమయ్యే కొద్ది ఆ ప్రభావం దిగుబడులపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ దురదృష్టం ఏమిటో కానీ… ప్రకృతి సహకరించింది, పంట బాగానే పండింది అనుకునేలోపు ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో సమస్య.. ఇలాంటి సమయాల్లోనే “వ్యవసాయం దండగ” అనే మాటలు ఎకో సౌండ్ లో వినిపిస్తుంటాయి అని వాపోతున్నారు పలువురు రైతులు!
ఇక ఆక్వా రైతుల విషయానికొస్తే.. వారి పరిస్థితి మరింత టెన్షన్ పెడుతోందని అంటున్నారు. చేపలు, రొయ్యల చెరువుల్లో రాత్రి వేళల్లో ఏరియేటర్లు నిరంతరం పనిచేయాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ఏరియేటర్లు ఏమాత్రం ఆగినా ఒకటి రెండు గంటల్లోనే రొయ్యలన్నీ తేలిపోయే ప్రమాదం ఉందని అంటారు. అదే జరిగితే ఆ రైతు పరిస్థితి వర్ణణాతీతం అని చెబుతారు. ఈ ఆక్వా కల్చర్ లోనూ డీజిల్ పాత్ర కీలకంగా ఉంటుంది!
ఇదే సమయంలో.. పిల్లలు, వృద్ధులతో ఇతర ప్రాంతాల నుంచి కార్లలో వస్తోన్న పలువురి వాహనాలు అర్ధరాత్రి సమయంలో హైవేలపై ఆగిపోయిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. మరోవైపు… ఇంధన కొరత రవాణా రంగానికి విస్తరించడంతో ఎక్కడికక్కడ సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి! సరుకులు తెచ్చే లారీలు బంకుల వద్ద బారులు తీరినా డీజిల్ దొరకలేదు. దీంతో… దాదాపు చాలా ప్రధాన నగరాల్లో లారీలు నిలిచిపోయాయని చెబుతున్నారు.
దీంతో నిత్యావసరాలు భగ్గుమంటున్నాయి! ఇందులో భాగంగా… నిత్యావసర సరుకుల ధరలు సుమారు పాతిక నుంచి ముప్పై శాతం పెరిగినట్లు చెబుతుండగా.. కూరగాయల ధరలైతే సుమారు ఏభై శాతం వరకూ పెరిగాయని చెబుతున్నారు. ఇదే గ్యాప్ లో పూలు, పండ్ల ధరలూ చుక్కలు చూపిస్తున్నాయని అంటున్నారు.
మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే… 108 వాహనాల సిబ్బంది సైతం అనేక బంకుల్లో డీజిల్ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయిందనే కథనాలు వెలువడుతున్నాయి. అత్యవసర వాహనాలకు రిజర్వు కోట నిల్వ ఉంచాలని తెలిసినప్పటికీ పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అంబులెన్స్ లకు సైతం డీజిల్ అందుబాటులో లేకుండా పోయిందని చెబుతున్నారు!
ఇలా వారు వీరూ అనే తారతమ్యాలు ఏమీ లేకుండా… పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఇతర ఊర్లకు వెళ్లే జనాలు, స్థానిక ప్రయాణాలకు ఆసరాగా ఉండే ఆటోలు, దూర ప్రాంత ప్రయాణికులు ఆధారపడే ప్రైవేటు బస్సులు, ప్రాణాలు నిలిపే అంబులెన్సులు, సరుకులు రవాణా చేసే లారీలు, పంట కోతకొచ్చిన అన్నదాతలు, రొయ్యపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆక్వా రైతులు… ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలనూ చంద్రబాబు సర్కార్ ఏడిపించేస్తోందని అంటున్నారు.
మరోవైపు… పశ్చిమ బెంగాల్ లో తుది విడత పోలింగ్ ఏప్రిల్ 29న పూర్తవ్వగానే.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 10 నుంచి 15 రూపాయలు పెంచే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందని.. ఈ ఆలోచన ఇంతకు ముందే ఉన్నప్పటికీ… ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం వేచి చూసిందని చెబుతున్నారు. ఈ ఎన్నికల చివరి దశ పోలింగ్ 29న పూర్తవ్వనుండటంతో.. ఆ రోజు సాయంత్రం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథంలోనే… ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని.. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ లాభపడడం ఆయనకు అలవాటుగా మారిందని.. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు రాష్ట్రంలో అదే జరిగిందని.. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై… వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
ఇదే సమయంలో… ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారని.. వారితో కూటమి నాయకులు జత కట్టారని.. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారని.. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారని జగన్ మండిపడ్డారు!
ఈ సందర్భంగా స్పందించిన మాజీ మంత్రి కన్నబాబు… కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎలా ఆదుకున్నారో గుర్తు తెచ్చుకోవాలని ప్రభుత్వానికి హితువు పలుకుతున్నారు. మరోవైపు… ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ కుంభకోణం ఉందంటూ కథనాలు వెలువడుతున్నాయి.
ఇదే సమయంలో… రాజధాని నిర్మాణ పనుల కోసం సుమారు 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల బల్క్ డీజిల్ ను రిటైల్ బంకుల నుంచి సరఫరా చేయాలని నాలుగు రోజుల క్రితం ఆయిల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు. దీనివల్లే పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు!
ఏది ఏమైనా… తాజా పరిణామాలతో రాష్ట్రంలోని వారూ వీరూ అనే తారతమ్యాలేమీ లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాలకు చెందిన ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారనేది మాత్రం వాస్తవమనే చెప్పుకోవాలి.
మరో దయణీయమైన విషయం ఏమిటంటే… ఇంధనం కోసం పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల మధ్య, రైతుల మధ్య భౌతికదాడులు సైతం చోటు చేసుకుంటున్నాయి! వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో… ఏపీ ప్రజలను ఈ స్థితికి తీసుకొచ్చింది కూటమి సర్కార్ అనే కామెంట్లు కనిపిస్తున్నాయి!
మరి ఈ నరకం నుంచి ప్రజలకు విముక్తి ఎప్పుడనేది.. పశ్చిమ బెంగాల్ ఎన్నిక అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. నిజంగా ఏప్రిల్ 29 తర్వాత ఇంధన ధరలు పెరిగితే జగన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందనే చర్చా జరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు!
