అభిమానులకు సారీ చెప్పిన డైరెక్టర్

సినిమా ఫెయిల్యూర్స్ విషయంలో ఈ మధ్య డైరెక్టర్లూ, హీరోలు.. ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పడం ఓ ట్రెండ్‌గా మారింది. గతంలో చరణ్, నాని తదితర హీరోలు అంచాలను అందుకోలేని తమ తమ సినిమాల విషయంలో ప్రేక్షకులను క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే.

తాజాగా ఓ డైరెక్టర్ తన సినిమా అంచనాలను అందుకోనందుకు తనను క్షమించాలని ఆడియన్స్‌ని కోరాడు. ఆయనెవరో కాదు.. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని, లేటెస్టుగా ‘మహా సముద్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి.

శర్వానంద్, సిద్ధార్ధ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్‌గా రిలీజై, ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై, ‘ఇది నా కలల ప్రాజెక్టు.. మా టీమ్ ఎంతో కష్టపడి ఈ సినిమా తెరకెక్కించాం. కానీ, ఎందుకో ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది. అందుకు సారీ చెబుతున్నాను.. ఈ సారి తప్పకుండా ప్రేక్షకుల అంచనాల్ని అందుకునే సినిమాతో త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను..’ అని అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.