ఇదెక్క‌డి పిచ్చి.. అభిమాన హీరోను క‌లిసేందుకు 140 కి.మీ పాద‌యాత్ర‌

హీరోల‌పై అభిమానుల‌కు ఉండే అభిమానం వెర్రిగా మారుతుంది. అభిమానం పేరుతో పిచ్చి పిచ్చి చేష్ట‌లు చేయ‌డం, కొంద‌రు ప్రాణాల‌ను రిస్క్ చేసి మ‌రీ త్యాగాలు వంటివి చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయోద్దంటూ హీరోలు హిత‌వు ప‌లుకుతున్నా కూడా అలాంటివే చేస్తూ సెల‌బ్రిటీల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. ఈ మ‌ధ్య అభిమాన హీరోను క‌లిసేందుకు పాద‌యాత్ర చేసే ప్రోగ్రాంలు పెట్టారు. ఆ మ‌ధ్య అల్లు అర్జున్‌ని క‌ల‌వాల‌ని ఓ అభిమాని దాదాపు 250 కిమీ దూరం నుండి ఇక్క‌డికి వ‌చ్చాడు. ఈ విష‌యం తెలుసుకున్న బ‌న్నీ ఆ అభిమానిని క‌లిసి ఫొటోలు దిగాడు. ఇక రీసెంట్‌గా వ‌రుణ్ తేజ్ కోసం 200 కి.మీ నుండి ఓ వ్యక్తి హైద‌రాబాద్‌కు న‌డుచుకుంటూ వ‌చ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వ‌రుణ్ ఆ వ్య‌క్తిని పిలిపించి మాట్లాడాడు.

తాజాగా వెంక‌టేష్ కోసం శ్రీనివాస్ అనే అభిమాని వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లోని బుద్ధారాం గ్రామం నుండి హైద‌రాబాద్‌కు న‌డ‌క మార్గాన చేరుకున్నాడు. ఎలా అయిన వెంకీని క‌ల‌వాల‌నే త‌ప‌న‌తో ఆయన పాద‌యాత్ర ద్వారా రామానాయుడు స్టూడియోకు చేరుకున్నాడు. కానీ ఆయన నారప్ప కోసం వేరే లొకేషన్‌లో ఉండటంతో కలవలేకపోయాడు. జ‌యం మ‌న‌దేరా చిత్రం నుండి వెంకీకు వీరాభిమానిగా మారాడు శ్రీనివాస్. ఈ సినిమాని దాదాపు 30 సార్లు చూశాడ‌ట‌. వెంక‌టేష్‌ని ఎలా అయిన క‌ల‌వాల‌ని ఆయ‌న క‌ల కాగా, ఇప్ప‌టికే నాలుగు సార్లు ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌. కాని అది కుద‌ర‌లేదు.

ఈ సారి పాదయాత్ర చేసుకుంటూ వెంకీని క‌లిసేందుకు వ‌చ్చాడు. కానీ ఆయన నారప్ప షూటింగ్‌లో ఉండటంతో కలవలేకపోయాడు. అయితే ఏదో ఒక రోజు మాత్రం వెంక‌టేష్‌ని త‌ప్ప‌క క‌లుస్తాన‌నే ఆశాభావం వ్య‌క్తం చేశాడు శ్రీనివాస్. కాగా, వెంక‌టేష్ ప్ర‌స్తుతం నార‌ప్ప చిత్రంతో పాటు ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నాడు. నార‌ప్ప చిత్రం అసుర‌న్‌కు రీమేక్‌గా తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో ప్రియ‌మ‌ణి క‌థానాయిక‌. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు. ఇక ఎఫ్ 3 చిత్రాన్ని అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నాడు.