
చేతికి ఎముక లేదేమో అనుకునేలా సేవా కార్యక్రమాలు చేసే కుటుంబాల్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడ ఒకటి. ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుగా గుర్తొచ్చేది చిరు ఫ్యామిలీనే. సహాయం చేయడంలో ముండేది కూడ మెగా హీరోలే. ఇండస్ట్రీకే కాదు రాష్ట్రానికి ఏ విపత్తు వచ్చినా చేయూతనివ్వడంలో చిరంజీవి కుటుంబం ఎప్పుడు ముందుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రెడ్ క్రాస్ తర్వాత అంత నెట్వర్క్ కలిగిన బ్లడ్ బ్యాంక్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఐ బ్యాంక్ స్థాపించి విజయవంతంగా నడుపుతున్న ఇండివిడ్యువల్ చిరంజీవి మాత్రమే. చిరంజీవి ఫౌండేషన్ తరపున అభిమానులు చేసే సేవా కార్యక్రమాలకు కొలతే లేదు.
అలాంటి చిరంజీవి మీద కొన్ని రోజులుగా అనవసర విమర్శల దాడి జరుగుతోంది. రాష్ట్రం కరోనా ఇబ్బందుల్లో ఉంటే చిరంజీవి చూస్తూ ఊరుకున్నారని ఒక వర్గం పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో అవాకులు చవాకులు పేలింది. చిరు సోనూ సూద్ ను చూసి నేర్చుకోవాలని నీతులు చెప్పింది. ఇక్కడ సోనూ సూద్ సహాయాన్ని చిన్నగా చూపడం కాదు కానీ ఆయనకంటే దశాబ్దాల క్రితమే చిరంజీవి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో పత్తి రైతులు నష్టాలపాలైతే ప్రభుత్వం కంటే ముందు వాళ్ళని ఆదుకున్న గొప్ప మనసు చిరంజీవిది.
అలాంటి సేవాగుణం ఉన్న వ్యక్తిని కష్టాలను చూస్తూ స్పందించని వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ చిరు అవేమీ పట్టించుకోలేదు. విపత్తు తీవ్రతను అంచనా వేసి చేసే సహాయం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చేదిగా ఉండాలని భావించి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అని జిల్లాల్లో ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ మొదలుకానున్నాయి. ఆక్సిజన్ అవసరం ఉన్నవారికి ఉచితంగా సిలిండర్లు అందించడమే ఈ బ్యాంక్స్ ఉద్దేశ్యం. ఈ కార్యం కరోనా బాధితులతో పాటు భవిష్యత్తులో ఆక్సిజన్ అవసరమైన అందరికీ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ దూరదృష్టితో సేవ చేయమని తనకు వేరొకర చెప్పాల్సిన పని లేదని మరోసారి నిరూపించారు చిరంజీవి.
