
‘అక్రమ లబ్ది’ ఆరోపణలతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నయ్ (ఎస్ఏఎంబీ) బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదు మేరకు సీబీై కేసు నమోదు చేసింది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపింది సీబీఐ. రఘురామకృష్ణరాజుకి చెందిన ఇండ్ పవర్ జెన్కమ్ లిమిటెడ్ సంస్థ, ఆ సంస్థకు చెందిన పలువురు డైరెక్టర్లు, ఇతర సిబ్బందిపైనా కేసులు నమోదయ్యాయి.
వ్యాపారం నిమిత్తం రుణం తీసుకుని, పెద్ద మొత్తంలో నిధుల్ని దారి మళ్ళించి, అక్రమంగా లబ్ది పొందారన్నది సీబీఐ నమోదు చేసిన అభియోగం. ఫోర్జరీ డాక్యుమెంట్లు సహా అనేక ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదు కావడం గమనార్హం. 2012 – 2017 మధ్యాలంలో ఈ మోసం జరిగిందని ఫిర్యాదులో రవిచంద్రన్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి లోక్ సభకు రఘురామకృష్ణంరాజు వైసీపీ తరఫున ఎన్నికైన విషయం విదితమే. ఆ తర్వాత ఆయన వైసీపీలో తిరుగుబాటుబావుటా ఎగురవేశారు. ప్రస్తుతం ఆయన వైసీపీకి దూరంగా వున్నారు.. గత కొన్నాళ్ళుగా రచ్చబండ పేరుతో అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దాదాపుగా ప్రతిరోజూ పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తూనే వున్నారు రఘురామకృష్ణరాజు. అయితే, మోసం పాతదేననీ, గతంలోనూ ఆయనపై ఇలాంటి కేసులు నమోదయ్యాయనీ, ఇది కొత్త వ్యవహారమేమీ కాదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోపక్క, రఘురామపై సీబీఐ కేసులతో ఆయన నోటికి తాళం పడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. నిత్యం రచ్చబండ పేరుతో నీతులు చెప్పే రఘురామ, ఇలా సీబీఐ కేసులో ఇరుక్కుపోవడమేంటబ్బా.?
