
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి మాత్రమే. అమరావతి నుంచే రాష్ట్ర పరిపాలన సాగుతోంది. అమరావతిలోనే అసెంబ్లీ వుంది.. అమరావతిలోనే సచివాలయం వుంది. అమరావతిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వుంటున్నారు. మరెందుకు, అమరావతి అభివృద్ధి దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోతోందా.? నిజానికి, అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ, కార్య నిర్వాహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలుని అభివృద్ధి చేయాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం. మంచి ఆలోచనే ఇది. అయితే, గడచిన రెండేళ్ళలో రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖ్యమంత్రి ఏం చేశారు.? అన్న చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. అమరావతిని పూర్తిగా అయోమయంలో పడేసింది వైఎస్ జగన్ సర్కార్.
చంద్రబాబు హయాంలో భూకుంభ కోణం జరిగిందా.? దోపిడీ జరిగిందా.? పబ్లిసిటీ స్టంట్లే నడిచాయా.? అన్నది వేరే చర్చ. అక్రమాలు జరిగితే, చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, అలా చర్యలు తీసుకోవడానికి రెండేళ్ళ సమయం జగన్ సర్కారుకి ఎందుకు సరిపోలేదు.? అన్నది ఖచ్చితంగా చర్చనీయాంశమే అవుతుంది. రాష్ట్రానికి మూడు రాజధానులని జగన్ సర్కార్ చెబుతోంది. అదే నిజమైతే, అందులో ఓ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి గడచిన రెండేళ్ళలో ఏం చర్యలు తీసుకుందో జగన్ సర్కార్, రాష్ట్ర ప్రజలకు చెప్పి తీరాలి. రెండేళ్ళ గడిచిపోయాయ్.. మిగిలింది మూడేళ్ళు మాత్రమే. అందులో గట్టిగా ప్రభుత్వానికి అవకాశం వుండేది రెండున్నరేళ్ళు మాత్రమే. రాజధాని అనేది వైఎస్ జగన్ సర్కారుకి, 2024 ఎన్నికల్లో తలనొప్పి కాకూడదంటే, ఇప్పటికైనా అమరావతి విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటుందా మరి.?
