చిరంజీవి సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌.. వైర‌ల్‌గా మారిన వార్త‌

స్వ‌యంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చిన చిరంజీవి ఎందరికో ఆద‌ర్శం అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఎన్నో ఒడిదుడుకులు, క‌ష్ట న‌ష్టాల‌ని చ‌విచూసిన వ‌చ్చిన చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్‌గా అంద‌రిచే కీర్తించ‌బ‌డుతున్నారు. న‌టుడిగానే కాక మంచి మాన‌వ‌తా వాదిగా చిరు గుర్తింపు తెచ్చుకున్నారు. అవ‌స‌రంలో ఉన్న వారికి లేద‌న‌కుండా చేసుకుంటూ వెళుతున్నారు. దాస‌రి నార‌య‌ణ‌రావు మ‌ర‌ణించిన త‌ర్వాత తెలుగు సినిమాకు బాధ్య‌త‌ల‌ను త‌న నెత్తిన వేసుకున్న చిరంజీవి యువ‌త‌కు కూడా చాలా అండ‌గా నిలుస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ సీజ‌న్ 4 ఫినాలే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చిరంజీవి కొంద‌రు కంటెస్టెంట్స్‌కు బంపర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ముఖ్యంగా సోహైల్ కోసం స్పెష‌ల్ బిర్యానీ పంపించ‌డంతో పాటు అత‌ను చేయ‌బోయే సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నాని కోట్లాది ప్రేక్ష‌కుల ముందు చెప్పాడు. అలానే మెహ‌బూబ్‌ని చూస్తుంటే చిన్న‌ప్పుడు నన్ను నేను చూసుకున్న‌ట్టు ఉంద‌ని అంటూ అత‌నికి రూ.10 ల‌క్ష‌ల రూపాయ‌ల సాయం కూడా చేశాడు. ఇప్పుడు మెహ‌బూబ్‌కి త‌ను న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్యలో గెస్ట్ రోల్ కూడా ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య చిత్రంలో చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా ఇందులో రామ్ చ‌ర‌ణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ మెహ‌బూబ్ కూడా చిత్రంతో అతిథి పాత్ర‌లో మెర‌వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిరంజీవి కోరిక మేర‌కు కొర‌టాల స్క్రిప్ట్‌లో కొద్ది మార్పులు చేసి మెహ‌బూబ్‌కు మంచి పాత్ర ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న మ‌రో కంటెస్టెంట్ దివికు చిరు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వేదాళం రీమేక్ చిత్రంలో దివి కోసం ఓ ప్ర‌త్యేక రోల్ ఉంటుంద‌ని బిగ్ బాస్ స్టేజ్‌పై నుండే చెప్పుకొచ్చాడు.