
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి నేటికి ఏడేళ్ళు. ఈ ఏడేళ్ళలో ఆంధ్రపదేశ్ రాష్ట్రం అనేక ఇబ్బందుల్ని చవిచూసింది. అత్యంత దారుణమైన విషయమేంటంటే, ఈ ఏడేళ్ళలో ఆంధ్రపదేశ్ రాష్ట్రం, సొంతంగా రాజధానిని నిర్మించుకోలేకపోయింది. అత్యంత దారుణంగా రాజధాని విషయమై రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. రెండు ప్రధాన రాజకీయ పార్టీల నడుమ రాజధాని నలిగిపోతోంది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రపదేశ్ రాజధానిగా గుర్తింపు పొందడమే కాదు, అక్కడ కొన్ని అధికారిక నిర్మాణాలూ జరిగాయి. అయితే, గొప్పలకు పోయి.. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. అంటూ ప్రకటనలు చేసుకుని, అమరావతిలో నిర్మితమైన నిర్మాణాలకు తాత్కాలికం అని పేరు పెట్టడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం.
దాంతో, అమరావతి కూడా తాత్కాలిక రాజధాని అనే భావన అందరిలోనూ పెరిగిపోయింది. ఏడేళ్ళలో ఓ రాష్ట్రం రాజధానిని నిర్మించుకోలేకపోయిందంటే అంతకన్నా అవమానకరం ఆ రాష్ట్ర ప్రజలకు ఇంకేముంటుంది.? పాలకులు, రాజకీయ నాయకులు మాత్రం దీన్ని అవమానంగా భావించలేకపోతున్నారు. ఏడేళ్ళలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఏడేళ్ళలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. ఉమ్మడి రాజధాని హైద్రాబాద్ని మాత్రం తక్కువ కాలంలోనే వదిలేసుకోవడంలో టీడీపీ, వైసీపీ అత్యుత్సాహం చూపిన మాట వాస్తవం. రాష్ట్ర విభజన రాజకీయ పార్టీలకు వరంగా మారితే, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది.
ఇప్పటికీ ఆంధ్రపదేశ్ నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పొరుగు రాష్ట్రాలకు పరిగెత్తాల్సిన ఖర్మ కొనసాగుతూనే వుంది. ఏడేళ్ళలో స్వీయ వృద్ధి సాధించలేకపోయింది ఆంధ్రపదేశ్. ‘మా హయాంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాం..’ అని అప్పట్లో టీడీపీ చెప్పుకుంది, ఇప్పుడు వైసీపీ చెబుతోంది. కానీ, వాస్తవ కోణంలో చూస్తే, గడచిన ఏడేళ్ళలో ఆంధ్రపదేశ్ రాష్ట్రం సాధించిందేమీ లేదు.. రికార్డు స్థాయిలో అప్పులు తప్ప. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే పెట్రోధరలు ఎక్కువ.. రాష్ట్ర ఆదాయం తక్కువ.. అభివృద్ధి గురించి మాట్లాడుకోవడమే దండగ. ఇంకెన్నాళ్ళీ రాజకీయ బీదరికం.?
