సమాజానికి సవాల్ ‘ఓ తండ్రి తీర్పు’.

లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో శ్రీరామ్ దత్తి నిర్మాతగా.. ప్రతాప భీమవరపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. శ్రీరామ్, ప్రతాప్, రాజేంద్ర, వివ రెడ్డి, రారాజు, కునాల్, కుషాల్, గుండు బ్రదర్స్ (రవీంద్రసూరి,భీమ) లక్ష్మీనారాయణ, మిమిక్రీ రాజు, అనురాధ, సురభి శ్రావణి, పునర్వి, మంజుల, రమ్యకృష్ణ, స్వాతి, ప్రమీల, అమృత వర్షిని, సాయి తేజ, సాయి చరణ్ తదితర తారాగణంతో చిత్రంలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సందర్బంగా.. షూటింగ్ లొకేషన్ లోకి వచ్చిన మీడియా ప్రతినిధులతో నిర్మాత శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ.. ” ఒక మంచి సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు పడే ఆవేదన పిల్లలకు ఒక కొత్త ఆలోచనను కలిగిస్తుందని నమ్మకం ఉంది. తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఓ చక్కటి మెసేజ్ తో ప్రేక్షకుల్లోకి వస్తున్నాం. కుటుంబమంతా సినిమా చూస్తూ ఆలోచనలో పడతారు. కచ్చితంగా తల్లిదండ్రులు పడే ఆవేదన పిల్లల మనసుల్లో ఓ కొత్త ఆలోచనను రీకెత్తించడం ఖాయం. ఇంత మంచి చిత్రానికి లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ గారి ఆశీస్సులు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

“ఓ తండ్రి తీర్పు గా నేను రాసుకున్న నవలను సినిమాగా తీయడం నా ఆశ ఆశయం. అది నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది.. సమాజానికి నేను సైతం ఒక సందేశాత్మక చిత్రాన్ని అందివ్వడం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాను..” అని దర్శకులు ప్రతాప్ భీమవరపు అన్నారు.

చిత్రానికి పర్యవేక్షణ చేస్తున్న రాజేంద్ర రాజు కాంచనపల్లి మాట్లాడుతూ.. ” ఇప్పటికే అనేక కుటుంబ కథా చిత్రాలు వచ్చాయి. మా సినిమాలో మన కుటుంబాల్లో జరుగుతున్న సంఘర్షణలు చూపిస్తూనే సరికొత్త పరిష్కారాలు కూడా చూపిస్తున్నాము . నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నిర్మాత శ్రీరాం దత్తి గారికి, సమర్పకులు లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ గారికి, దర్శకులు ప్రతాప్ భీమవరపు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని అన్నారు.

ఓ తండ్రి తీర్పు చిత్రానికి డి. ఓ. పి.సురేష్ చెట్ పల్లి,కో డైరెక్టర్ కళింగ కోట, అసిస్టెంట్ డైరెక్టర్ బాలచందర్, మేనేజర్ రామకృష్ణ రాజు, ఆర్ట్ దుద్దిపూడి రాజు, మేకప్ కరుణాకర్, లక్ష్మి.