Hyderabad: పహల్గాం ఉగ్ర దాడిలో భాగంగా 28 మంది అమాయకులు బలి అయిన విషయం మనకు తెలిసిందే. పర్యాటక ప్రాంతమైనటువంటి పహల్గాం వద్దకు ఎంతో మంది పర్యాటకులు వచ్చి ప్రకృతి అందాలను వీక్షిస్తూ వచ్చారు. అప్పుడే పెళ్లయిన కొత్త జంటలు హనీమూన్ కోసం ఇక్కడికి తరలి వచ్చారు. అలాగే పదవి విరమణ తర్వాత చాలామంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఈ పర్యాటక ప్రాంతానికి వచ్చారు కానీ ఈ పర్యాటక ప్రాంతంపై ఒక్కసారిగా ఉగ్రమూక దాడి చేసి ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకుంది.
ఈ దాడి ఘటనలో సుమారు 28 మంది పర్యాటకులు మరణించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ దాడిపై చాలా సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే తమ దేశంలోకి వచ్చి ఇలా దాడి జరిపినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను వదిలే ప్రసక్తే లేదంటూ మోడీ సర్కార్ ఈ దాడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ప్రపంచ దేశాలు కూడా స్పందిస్తూ భారత్ కి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు.
ఈ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి భారత్ మీదకు ఉసిగొల్పుతుందని ఆ దేశంలో దౌత్య సంబంధాలు రద్దు చేసింది. ఇండియాలో పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేసి వెళ్లాలని విదేశాంగ శాఖ ఆదేశాలు పంపింది.
ఇప్పటికే ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ వీసాలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఇండియాలో ప్రతి రాష్ట్రంలో పాకిస్తానీలు ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా ఇచ్చిన గడువు లోపు ఇండియా వదిలి వెళ్ళకపోతే శిక్ష తప్పదని ఆదేశాలను జారీ చేశారు అయితే హైదరాబాదులో 208 మంది పాకిస్తానీలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.వీరి మరో రెండు రోజుల్లోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కేంద్ర ఇచ్చిన గడువు ముగుస్తోండటంతో అన్నిరాష్ట్రాలను కేంద్రహోంశాఖ అలెర్ట్ చేసింది.