
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ మిత్రపక్షమే అయినా.. ఎన్నికలొస్తే.. రెండు పార్టీల మధ్య ఓటు బ్యాంకు మాత్రం సరైన రీతిలో ఎక్స్ఛేంజ్ కావడంలేదు. ప్రధానంగా బీజేపీ ఓటు బ్యాంకు జనసేనకు కాకుండా వైసీపీ వైపుకు వెళుతోంది. జనసేన ఓటు బ్యాంకు బీజేపీకి కాకుండా టీడీపీ, వైసీపీల వైపుకు వెళ్ళిపోతోంది. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో తేలిందిదే. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన ఖచ్చితమైన అవగాహనతో వెళ్ళి వుంటే, ఇంకా ఎక్కువ చోట్ల జనసేన గెలిచి వుండేది. బీజేపీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించి వుండేది. ఇక, తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఏం జరుగుతుంది.? అంతకన్నా ముందు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏమవుతోంది. స్థానిక ఎన్నికల్ని పక్కన పెడితే, తిరుపతి ఉప ఎన్నిక కోసం జనసేన నుంచి ఒక్క ఓటు కూడా పక్కకు మళ్ళకుండా తమ ఖాతాలోనే పడాలని బీజేపీ భావిస్తోంది. అందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేసింది కూడా.
బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తమ్ముడని చెబుతూ రాఖీ కట్టడం కూడా ఓటు బ్యాంకు వ్యూహమే. బలిజ కమ్యూనిటీ అంశాన్ని పవన్ చెవిన వేసింది కూడా బీజేపీ నేతలే. ఇవన్నీ దేనికి సంకేతాలు.? నిజానికి, పవన్ కళ్యాణ్ మతాల ప్రస్తావన తీసుకురావడానికి పెద్దగా ఇష్టపడరు. ఆయనకు వెనకాల నుంచి సమాచారం ఇచ్చింది కూడా బీజేపీనే. ఇవన్నీ, జనసేన ఓటు బ్యాంకు పూర్తిగా బీజేపీ వైపు మళ్ళించే ఆలోచనతోనేనన్నది నిర్వివాదాంశం. అయినాగానీ, తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న అవమానాలు, ఏపీ బీజేపీలోనూ కొందరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైనం.. ఇవన్నీ చూశాక, ఖచ్చితంగా జనసేన ఓటు బ్యాంకులో కొంత చీలిక వస్తుంది. కొందరు ఓట్లేయడానికి కూడా సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. అయితే, అలాంటి వారి విషయంలో కూడా మరిన్ని వ్యూహాలు బీజేపీ ఇప్పటికే సిద్ధం చేసిందని సమాచారం.
