ఈ అమాయకపు డిఫెన్స్ ఇంకెన్నాళ్లు హరీష్ రావుగారు

రాజకీయ పరమైన విషయాల్లో ప్రత్యర్థి పార్టీల నుండి విమర్శలు రావడం వాటిని అధికార పక్షాలు తిప్పికొట్టడం ఎప్పుడూ జరిగే విషయమే.  ప్రజలు కూడా ఆ విషయాలను పెద్దగా పట్టించుకోరు.  ఎందుకంటే వాటికి ఆధారాలు, రుజువులు ఉండవు కాబట్టి.  అలాంటి వాటిని తిప్పికొట్టొచ్చు.  కానీ ప్రత్యక్షంగా కళ్ల ముందు కనబడుతున్న పొరపాట్లని కూడా కప్పిపుచ్చుకోవాలని చూడటం, నేరుగా ప్రజలకే తెలుస్తున్న విషయ పరిస్థితిని అంతా బాగే అంటూ బుకాయించడం సబబు కాదు.  అలాంటి ధిక్కరణ ఎక్కువసేపు నిలబడు కూడ. 

ప్రజెంట్ తెరాస నేతల స్వీయ రక్షణ చర్యలు ఇలానే ఉన్నాయి.  ఒకవైపు రాష్ట్రంలో కరోనా విపరీతంగా ప్రభలుతుంటే నివారణ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి.  రోజుకు కనీసం 5000 టెస్టులు కూడా చేయలేక, వాటిని వేలెత్తి చూపించే వారిపై ధ్వజమెత్తుతున్నారు.  రోజుకు పాజిటివ్ కేసులు 500 నుండి 600 తగ్గకుండా నమోదవుతున్నాయి.  నిన్న కూడా 730 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఇక ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల్లో అలసత్వం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.  కళ్ల ముందు ఇన్ని కనిపిస్తున్నా తమని మాత్రం తప్పుబట్ట వద్దన్నట్టు ఉంది తెరాస ప్రధాన నాయకుల ధోరణి. 

Read More : టీడీపీ నేత ప‌ట్టాభి హౌస్ అరెస్ట్..300 కోట్లు కుంభ‌కోణం

తాజాగా భాజపా కీలక నేత జేపీ నఢ్ఢా తెరాస ప్రభుత్వంపై కాళేశ్వరం అంచనా వ్యయం పెంపు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం, ఆయుష్మాన్ భారత్ అమలుచేయకపోవడం, కరోనా కట్టడిలో వైఫల్యం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.  ఆయన చేసిన మిగతా ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నా లేకపోయినా కరోనా విషయంలో మాత్రం ఆధారాలున్నాయి.  అయినా ప్రభుత్వం వాటిని తిప్పికొట్టే యత్నం చేస్తోంది.  మంత్రి ఈటెల అయితే 1000 వెంటిలేటర్లు అడిగితే 50 మాత్రమే ఇచ్చారని, నడ్డా గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు కానీ టెస్టులు పెరగకపోవడం మీద వివరణ ఇవ్వలేదు.  

ఇక మరొక మంత్రి హరీష్ రావుగారైతే నడ్డాగారు సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులు, ప్రాణాలకు లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్న వైద్యులు ఒక్కటే అని కదా మనం అనుకుంటున్నది.  ప్రధాని కూడా అదే కదా చెప్తున్నారు.  దేశ రక్షణ విషయంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం అనుచితం కాదని మీరే అంటారు.  సైనికుల నైతికస్థైర్యం దెబ్బతీస్తుందని ఉద్బోదిస్తారు.  మరి కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా ? దేశానికి వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంఉన్న మీరే వైద్యులు చేస్తున్నకృషిని తక్కువ చేసి చూపడం సబబా ?  ఇది వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్య కాదా ? అన్నారు. 

Read More : అమృత వ్యాఖ్య‌ల‌పై వ‌ర్మ కౌంట‌ర్ ఎటాక్

ఈ తరహా డిఫెన్స్ కరోనా ఆరంభ పరిస్థితుల్లో అయితే పనికొచ్చేది.  ఎందుకంటే అప్పుడు వైరస్ ప్రభావం, నివారణ మీద పెద్దగా అవగాహన ఏ రాష్ట్రానికీ లేదు కాబట్టి.  కానీ మూడు నెలలు గడుస్తున్నా, కర్తవ్యం ఏంటో బోధపడుతున్నా పనితనంలో లోపం పెట్టుకుని ఇలా అమాయకపు డిఫెన్స్ చేయడం చెల్లదని గులాబీ నేతలు గుర్తించాలి.