వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు మీద ప్రతిరోజూ కొత్త కొత్త ఆరోపణలు చేస్తూనే ఉంటారు. గతాన్ని తవ్వి మరీ బాబుగారిని, ఆయన బృందాన్ని ఇరుకున పెడుతూ ఉంటారు. తాజాగా ఆయన లేవనెత్తిన అంశం చంద్రబాబుగారు గతంలో శాసనసభ ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రాల పార్టీలకు చేసిన ఫండింగ్ గురించి. విజయసాయిగారు ట్వీట్ చేస్తూ ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్, మరో 8 చిన్న పార్టీలకు బాబుగారు వేల కోట్ల ఫండింగ్ చేశారు. అంత డబ్బు ఆయనకు ఎక్కడి నుండి వచ్చిందోవార్నిఎ జాతీయా మీడియా సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బాబుగారి ఆలీబాబా 40 దొంగల స్టోరీ మోదీ, అమిత్ షా గార్లకు బాగా తెలుసు అన్నారు.
ఆయన వెలికితీసిన వేల కోట్ల ఫండింగ్ అంశం బాబుగారిని చిక్కుల్లో పెట్టడానికి ఉపయోగపడేదే అయినా చివర్లో ఆయన మోదీ, అమిత్ షాలకు కూడా ఈ విషయం తెలుసని అనడం చూస్తే వారికి ఈ విషయాన్ని గుర్తుచేయాలనే ప్రయత్నంలా అనిపిస్తోంది. కానీ సాయిరెడ్డిగారు ఆశించినట్టు మోదీ ఈ విషయాన్ని పట్టించుకుని బాబుగారి మీద చర్యలకు పూనుకుంటారనేది దాదాపు జరగని పనే అనాలి. అసలు ఈ ఫండింగ్ విషయాన్ని అప్పట్లో టీడీపీ నేతలే గొప్పల కోసం బాహాటంగా చెప్పుకున్నారు. ఆ వార్తల్లో ఎంత నిజముందో తేలాల్సి ఉంది కానీ తమకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్, ఇతర పార్టీలకి బాబు ఫండింగ్ చేశారని అప్పట్లో మోదీ చాలా గుస్సా అయ్యారు.
కానీ చంద్రబాబు మీద విచారణకు పూనుకోలేదు. ఇందుకు కారణం ఏపీలో వారు అవలంభిస్తున్న ద్వంద వైఖరి. మోదీ ప్రజెంట్ జనసేనతో స్నేహం చేస్తున్నా కూడా వైసీపీ, టీడీపీలలో ఏ పార్టీకీ పూర్తి వ్యతిరేకంగా కానీ పూర్తి మద్దతుగా కానీ లేరు. సంధర్భాన్ని బట్టి తటస్థంగానే స్పందిస్తోంది రాష్ట్ర భాజాపా. ఎందుకంటే మోదీ ఏపీకి ప్రత్యేక హోదా బాకీ ఉన్నారు. ఏ పార్టీని గట్టిగా నొక్కినా ఆ డిమాండ్ లేవనెత్తుతారు. ప్రధాన పార్టీలు సైతం హోదా అంశంలో మౌనంగానే ఉన్నాయి. కారణం మోదీ ముందు వారి లొసుగులు వారికున్నాయి.
మొత్తం మీద బిజెపి ఏపీలో ఒకరకమైన పరస్పర అవగాహనపూరిత రాజకీయాలు చేస్తోంది. ఈ అవగాహనను ఇప్పుడప్పుడే బ్రేక్ చేసే ఆలోచన వారికి లేదు. కాబట్టి ఫండింగ్ అంశంలో మోదీగారు స్పందించ, చంద్రబాబును ఇబ్బంది పెడతారని విజయసాయిగారు ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగులుతుంది. అయినా ఈ లాజిక్ విజయసాయి లాంటి మాస్టర్ మైండ్ కి అందనిది కాదు. అయినా ప్రస్తావించారు అంటే అది జనంలో చంద్రబాబు మీద మరింత నెగెటివిటీ పెంచడానికి చేసిన ప్రయత్నమే అనుకోవాలి.