డబ్బింగ్‌ పార్ట్‌ పూర్తి చేసే పనిలో ‘జీబ్రా’

సహాయ నటుడిగా కెరీర్‌ ప్రారంభించి.. జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు సత్యదేవ్‌. సినిమాలు భారీ రేంజ్‌లో హిట్లు కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్‌ఫార్మ్‌ చేస్తుంటాయి. ప్రస్తుతం సత్యదేవ్‌ మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ’జీబ్రా’ ఒకటి. ఈ చిత్రానికి ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది.

కాగా ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్‌ ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి సత్యదేవ్‌ కథా బలమున్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. హీరోగానే కాకుండా మధ్య మధ్యలో కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు.. సత్యదేవ్‌ కూడా తన రోల్‌కి డబ్బింగ్‌ చెబుతున్నట్లు మేకర్స్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

అంతేకాకుండా ‘జీబ్రా’ చిత్రం యాక్షన్‌ కైమ్ర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని.. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందని తెలిపారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలు పెట్టినట్లు, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుంది. ‘పుష్ప’ సినిమాతో ఫేమస్‌ అయిన ధనంజయ (జాలిరెడ్డి) ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌, పద్మ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, బాలసుందరం, దినేష్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.