‘సార్’ లాంటి సినిమా తీయడం ఆషామాషి కాదు- ఆర్. నారాయణమూర్తి

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(వాతి). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో హ్యాండ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో కనువిందు చేశారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న భారీస్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ రెండు భాషల్లోనూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. సార్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో తాజాగా చిత్ర బృందం విజయోత్సవ సభను నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి, నటీనటులు సంయుక్త మీనన్, సుమంత్, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకను ప్రారంభించే ముందు ఇటీవల స్వర్గస్తులైన సినీ నటుడు నందమూరి తారకరత్నకు నివాళులు అర్పిస్తూ చిత్ర బృందం కాసేపు మౌనం పాటించారు.

ముఖ్య అతిథి ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. “ముందుగా ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని, ఒక గొప్ప చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గుండెలకు హత్తుకునేలా సినిమా ఉంటే సూపర్ హిట్ చేస్తామని మరోసారి ప్రేక్షకులు నిరూపించారు. ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడికి నా అభినందనలు. ఇలాంటి సినిమాలు తీయడం ఆశామాషి కాదు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు.. కానీ ఆర్ట్ ఫిల్మే. ఇది కమర్షియల్ సినిమా కాదు.. కానీ కమర్షియల్ సినిమానే. అలా మాయ చేశాడు దర్శకుడు. ఇది ప్రజల సినిమా, స్టూడెంట్స్ సినిమా, పేరెంట్స్ సినిమా. జీవితంలో గుర్తుండిపోయే ఇలాంటి సినిమా తీసి హిట్ కొట్టిన నిర్మాతకు నా అభినందనలు. హాలీవుడ్ యాక్టర్ సిడ్నీ పోయిటియర్ నటించిన ‘టు సర్, విత్ లవ్’, ఎన్టీ రామారావు గారి ‘బడిపంతులు’, హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ లాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విద్య, వైద్యం అనేవి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని రాజ్యాంగ మనకు కల్పించిన హక్కు. కానీ అవి వ్యాపారం అయిపోయాయి. విద్య, వైద్యం వ్యాపారం కాకూడదు. పేదలందరికీ విద్య అందుబాటులో ఉండాలి.. ప్రైవేట్ సెక్టార్ వద్దు, పబ్లిక్ సెక్టార్ ముద్దు అనే సందేశాన్ని చాటి చెప్పిన ఈ చిత్రానికి హ్యాట్సాఫ్. దర్శకుడు సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించాయి. ప్రతి పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సంయుక్తమీనన్, సాయి కుమార్, సముద్రఖని, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది అందరూ అద్భుతంగా నటించారు. కెమెరామెన్ 90ల బ్యాక్ డ్రాప్ ని చక్కగా చూపించారు. ధనుష్ గారు గొప్ప నటుడు. సహజంగా నటిస్తారు. భాషతో సంబంధం లేకుండా అందరికీ దగ్గరైన నటుడు. ఆయన నటనకు సెల్యూట్.” అన్నారు.

నటుడు సుమంత్ మాట్లాడుతూ.. “ఇంత మంచి పాత్ర రాసి, ఆ పాత్రకు నేను న్యాయం చేస్తానని నమ్మిన దర్శకుడు వెంకీకి థాంక్స్. తక్కువ రోజులే పనిచేసిన ఈ సినిమాలో భాగం కావడం ఆనందాన్ని ఇచ్చింది. నాకొక అలవాటు ఉంది. పాత్ర చిన్నదైనా పెద్దదైనా స్క్రిప్ట్ మొత్తం చదవడం అలవాటు. చదవగానే ఈ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సబ్జెక్ట్ తీస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనిపించింది. ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. ఈ స్థాయిలో వసూళ్ళు రావడం సంతోషంగా ఉంది” అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా నా డైరెక్షన్ డిపార్టుమెంట్.. కో డైరెక్టర్ శ్రీవాత్సవ్ గారు, సతీష్ చంద్ర, అంజి, రమేష్, శివ, నవీన్, హరీష్, రామారావు గారు, వెంకటేష్ మీనన్, పవిష్ నారాయణ్, చరణ్ వీళ్లు నా టీమ్. ఈరోజు ఈ సినిమాకి ఇన్ని ప్రశంసలు దక్కుతున్నాయి అంటే వీళ్ళందరూ కారణం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారి టీమ్, సినిమా పబ్లిసిటీ దిగ్విజయంగా నిర్వహించిన పీఆర్ఓ వేణుగోపాల్ గారు, డిజిటల్ మీడియా చూసుకున్న సందీప్ కులకర్ణి గారు, నా సపోర్ట్ చేసిన నా స్నేహితులు వంశీ కాక, నాని అందరికీ ధన్యవాదాలు. ఫైట్ మాస్టర్ వెంకట్ గారు, డీఓపీ యువరాజ్ గారు, ఎడిటర్ నవీన్ నూలి గారు, కావ్య శ్రీరామ్, రజినీ, సంధ్య, మేకప్ నాగు, శేఖర్ మాస్టర్, విజయ్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గారు అందరికీ బిగ్ థాంక్స్. లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, ప్రణవ్, సింగర్స్ శ్వేతా మోహన్, కాల భైరవ, అనురాగ్ కులకర్ణి, ప్రణవ్ అందరికీ థాంక్స్. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా మొదటి సినిమా తొలిప్రేమ అక్కడ చేశాం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సార్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాను. డిఐ మదన్, ప్రసాద్, సీజీ వాసు గారు, ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ సాగర్.. ఇలా వీళ్లు అందరూ కలిస్తేనే ఈరోజు ఈ సక్సెస్. తనికెళ్ళ భరణి గారు సెట్ లో ఉంటే దైవత్వం న్నట్లు ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. ఆయన ఈ సినిమాలో నటించడం మా అదృష్టం. సినిమాలో భాగమై ఇంతటి విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమా విజయం సాధిస్తుందని సుమంత్ గారు ముందే అన్నారు. ఆయనను ప్రీరిలీజ్ కి రమ్మని అడిగితే సర్ప్రైజ్ రివీల్ అవ్వకుండా ఉండాలని, డైరెక్ట్ గా సక్సెస్ మీట్ కి వస్తానన్నారు. ఈ సినిమా విజయాన్ని ఆయన ముందుగానే ఊహించారు. ఆయన పరిచయమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.

చిత్ర కథానాయిక సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ” మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న తెలుగు, తమిళ ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మాకు నమ్మకం ఉంది. నేను పోషించిన మీనాక్షి పాత్రను ఇంతలా ఆదరిస్తారని అసలు ఊహించలేదు. నా కెరీర్ లో ప్రేక్షకుల నుంచి ఇంత ప్రేమను ఎప్పుడూ చూడలేదు. ఇంత మంచి సినిమాలో, నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు వెంకీ గారికి థాంక్స్. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తూ నా విజయానికి కారకులైన వంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధనుష్ గారు, సముద్రఖని గారు, భరణి గారు, ఆది గారు, సాయి కుమార్ గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది” అన్నారు.

సాయి కుమార్ మాట్లాడుతూ.. “నారాయణమూర్తి గారు ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆశీర్వదించిన ప్రేక్షకదేవుళ్ళు అందరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బాగుందని అన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. నర్సన్నపేట నుంచి ఓ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నా ఫోన్ నెంబర్ ఎలాగో సంపాదించి ఫోన్ చేసి.. ఈ సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఇది ప్రతి టీచర్, ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ చూడాల్సిన సినిమా అన్నారు. విద్య నేపథ్యంలో వచ్చిన గొప్ప చిత్రాలలో ఒకటని కొనియాడారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది. ఇంత మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు వెంకీకి, ఇలాంటి అద్భుతమైన కథకు మద్దతుగా నిలిచిన నిర్మాతలు వంశీ గారికి, సాయి సౌజన్య గారికి అభినందనలు.” అన్నారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. “తల్లిదండ్రులు తర్వాత గురువే. తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు. ఒక దర్శకుడు ఒక అర్థవంతమైన కల కన్నాడు, ఒక సంస్కారవంతమైన కల కన్నాడు.. దానిని ప్రేక్షకులు సాకారం చేశారు. గతంలో గురువులను వేళాకోళం చేసేవాళ్ళు. చాలా బాధ కలిగేది నాకు. ఎందుకంటే మనం ఈ స్థాయికి రావడానికి గురువులే కారణం. వెంకీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మేం దగ్గరుండి చూశాం. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ఫలితం పొందాడు. ఈ సినిమాతో విశ్వనాథ్ గారిలాగా తనదైన ఒక ముద్రను ఆరంభించాడు. వెంకీ ఇలాంటి సంస్కారవంతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గురువులకు లేచి నమస్కారం పెట్టాలనిపించే సంస్కారవంతమైన సినిమా ఇది. ధనుష్ చాలా గొప్ప దర్శకుడు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటాడు. ఒక గొప్ప సినిమాలో నటించానని సంతృప్తిని మిగిల్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.

సముద్రఖని మాట్లాడుతూ.. “మనం జనాలను ప్రేమిస్తే.. జనాలు మనల్ని ప్రేమిస్తారు. మనం సమాజాన్ని ప్రేమిస్తే.. సమాజం మనల్ని ప్రేమిస్తుంది. అదే ఈ సినిమా. ఇలాంటి కథ రాయాలంటే మంచి హృదయం ఉండాలి.. సమాజం పట్ల ప్రేముండాలి.. అలాంటి వాళ్ళే ఇంతమంచి కథలు రాయగలరు. మంచి మనసున్న వాళ్ళు అందరూ కలిసి ఒక మంచి సినిమా చేశారు. ఇది మన బ్రెయిన్ ని వాష్ చేసే ఫిల్మ్. మన గురువులకు కాల్ చేసి మాట్లాడాలి అనిపించే ఫిల్మ్. దిగువ మధ్యతరగతి కుటుంబాల బాధను తెలిపిన ఫిల్మ్. ఈ సినిమా చూసినప్పుడు నా పేరెంట్స్, టీచర్స్ గుర్తొచ్చారు. ఇలాంటి సినిమాలో భాగం కావడం దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాను” అన్నారు.

హైపర్ ఆది మాట్లాడుతూ.. “డబ్బుకి కాకుండా మనుషులకి విలువనిచ్చే నారాయణమూర్తి గారు ఇక్కడి వచ్చి మా సినిమా గురించి మాట్లాడటం సంతోషంగా ఉంది. ఈ సినిమా మనల్ని నవ్వించింది, ఏడిపించింది, గూజ్ బంప్స్ తెప్పించింది, మంచి సినిమా చూశామన్న ఆనందాన్ని ఇచ్చింది, ధనుష్ గారి మీద ఇంకా ప్రేమ కలిగేలా చేసింది, దర్శకుడు వెంకీ అట్లూరి గారి మీద గౌరవం కలిగేలా చేసింది, సితార బ్యానర్ కు కలెక్షన్లు వచ్చేలా చేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతున్నారు. ఈ సినిమా చూశాక మనకు మన గురువులు గుర్తొస్తారు.” అన్నారు.

డీఓపీ యువరాజ్ మాట్లాడుతూ.. “మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ధనుష్ గారు ఈ సినిమాలో నటించలేదు.. బాలు పాత్రలో జీవించారు. ఈ సినిమాతో మా దర్శకుడు వెంకీ గారు డిస్టింక్షన్ కొట్టేశారు. సంయుక్త, సుమంత్ గారు, సముద్రఖని గారు, సాయి కుమార్ గారు, భరణి గారు, ఆది గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత వంశీ గారికి, వెంకీ గారికి, ధనుష్ గారికి ధన్యవాదాలు” అన్నారు.

ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ వేడుకకు స్రవంతి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో విద్యార్థులుగా నటించి అలరించిన పిల్లలతో ఈ వేడుకకు ప్రారంభించడం విశేషం. అలాగే ముఖ్య అతిథిగా హాజరైన నారాయణమూర్తితో కలిసి మూవీ టీమ్ కేక్ కట్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు.