విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చిత్ర బృందం

రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు – 2 సినిమాకి పేరు ఖరారైంది. రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో మహేంద్రగిరి వారాహి అనే పేరుతో సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించింది.

హీరో సుమంత్‌, హీరోయిన్‌ మీనాక్షి, చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్‌, నిర్మాతలు కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి తదితరులు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు చేసి, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసారు. రాజశ్యామల అమ్మవారితో వారాహి అమ్మవారికి ఉన్న అనుబంధం గురించి చిత్ర బృందం స్వాత్మానందేంద్ర స్వామిని అడిగి తెలుసుకుంది. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు.

మహేంద్రగిరి వారాహి చిత్రానికి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నామని అన్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగుతోందని, రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఆలయం విశాఖ శారదాపీఠంలోనే ఉన్నందున అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చామని అన్నారు. ఈ ఏడాది జూన్‌ నెలలో షూటింగ్‌ ప్రారంభమైందని, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. మహేంద్రగిరి వారాహి చిత్ర ఇతివృత్తాన్ని స్వరూపానందేంద్ర స్వామికి వివరించి ఆశీస్సులు అందుకున్నామని అన్నారు.

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ కింద చిత్రీకరిస్తున్న సినిమాల్లో మహేంద్రగిరి వారాహి రెండవ చిత్రమని నిర్మాత కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి తెలిపారు. రాజశ్యామలని నిత్యం ఉపాసించే తాను అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం ఇక్కడకు రావడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. చిత్రం విజయవంతమైన అనంతరం మళ్ళీ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శిస్తామని పేర్కొన్నారు. చిత్ర బృందాన్ని పీఠాధిపతులు శాలువాతో సత్కరించారు.