2025 సంక్రాంతికి ‘శతమానం భవతి నెక్ట్స్ పేజ్’ చిత్రాన్ని విడుదల చేయనున్న దిల్ రాజు

స్టార్ హీరోల‌తో భారీ చిత్రాల‌ను నిర్మిస్తూనే డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల‌తో మినిమం బ‌డ్జెట్‌తో రూపొందిస్తోన్న ఘ‌న విజ‌యాల‌ను సాధిస్తోన్న నిర్మాత దిల్ రాజు. ఈయ‌న శ్రీవెంట‌కేశ్వ‌ర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై 2017లో రూపొందించిన చిత్రం ‘శతమానంభవతి’. స‌తీష్ వేగేశ్న ఈ సినిమాను తెర‌కెక్కించారు.

‘శతమానంభవతి’ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 2017లో భారీ చిత్రాల న‌డుమ గ‌ట్టిపోటీతో విడుద‌లైన ఈ చిత్రం తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

కుటుంబ క‌థా చిత్రాల‌కు కేరాఫ్‌గా నిలిచిన శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ బ్యాన‌ర్‌కి ‘శతమానంభవతి’ చిత్రం ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకు రావ‌ట‌మే కాకుండా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జాతీయ అవార్డును ద‌క్కించ‌కుని తెలుగు సినీ ఇండ‌స్ట్రీ గొప్ప‌తనాన్ని చాటింది.

ఈ క్ర‌మంలో 2024 సంక్రాంతికి నిర్మాత దిల్ రాజు ‘శతమానంభవతి’కు సీక్వెల్‌గా ‘శతమానంభవతి నెక్ట్స్ పేజ్‌’ను రూపొందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బ్యాన‌ర్ వేల్యూకు త‌గ్గ‌ట్లు గ్రాండ్ స్కేల్‌లో ఈ సీక్వెల్‌ను రూపొందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ‘శతమానంభవతి నెక్ట్స్ పేజ్’ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు దిల్ రాజు పేర్కొన్నారు.