సెప్టెంబర్ 22న ‘రుద్రం కోట’ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా- శ్రీకాంత్

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `రుద్రంకోట‌`. ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీల్‌, విభీష‌, అలేఖ్య‌ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో…

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నేను, రాశీ, సుచిత్ర కలిసి ఎన్నో సాంగ్స్ చేశాం. రామ్ లక్ష్మణ్ మాస్టర్లను ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం. జయలలిత గారితో పంచదార చిలక చిత్రంలో నటించాం. ఆమె చాలా మంచి వ్యక్తి. రుద్రం కోట నిర్మిస్తున్నాను అని జయలలిత గారు చెప్పారు. ఏది హిట్ అయితే అది పెద్ద సినిమా. ఇందులో పాటలు బాగున్నాయి. ట్రైలర్ బాగుంది. అనిల్ బాగా చేశాడు. హీరోయిన్లు బాగా చేశారు. రాము గారు ఎన్నో సీరియల్స్ చేశారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్ 22న రాబోతోన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రాశీ మాట్లాడుతూ.. ‘నిర్మాతగా అనిల్ నాకు తెలుసు. కానీ ఆయనలో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడని తెలియదు. సుచిత్ర గారు చక్కగా చేయించారు. మా జయమ్మ ఇందులో అద్భుతంగా నటించారు. ఇప్పుడు చిన్నా, పెద్ద సినిమాలు అనేవి లేవు. ఆడియెన్స్‌కు నచ్చితే అన్నీ పెద్ద చిత్రాలే. పోస్టర్లను జనాలు చూస్తున్నారు. నేను కూడా రోడ్డు మీద వెళ్తుంటే పోస్టర్లు చూశాను. టీజర్, ట్రైలర్ అన్నీ బాగున్నాయి. రాము గారి టాలెంట్ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

డైరెక్టర్ రాము మాట్లాడుతూ.. ‘అస్మిత, ప్రభాకర్, జీ తెలుగు అనురాధా లేకపోతే నేను ఇక్కడకు వచ్చే వాడ్ని కాదు. జయమ్మ నా వెన్నంటి నిల్చున్నారు. ఆమె లేకపోతే ఈ సినిమానే వచ్చేది కాదు. సుచిత్ర మేడం మాతో పాటు ఎంతో కష్టపడ్డారు. జాషువా గారు మాకు ఎంతో సహకరించారు. సాగర్ పాటలు బాగా రాశారు. కోటి గారు ఆర్ఆర్ ఇవ్వడం చాలా అదృష్టం. జయమ్మ ఒకే ఒక్క ఫోన్ చేయడంతో శ్రీకాంత్ గారు స్పందించారు. అడక్కుండానే వరం ఇచ్చిన దేవుడిలాంటి వారు. రాశీ గారిని జానకి కలగనలేదు సీరియల్‌లో జ్ఞానంబగా చూపించాను. మా హీరోయిన్లు బాగా నటించారు. ఇల్లీగల్ రిలేషన్ వల్ల పిల్లలకు ఎదురయ్యే సమస్యల మీద, లవ్ అండ్ లస్ట్ మీద చిత్రాన్ని తీశాను. ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ మాస్టర్ ముందు చేయి ఇచ్చారు. శ్రీకాంత్ గారు ఇక్కడకు వరకు తీసుకొచ్చారు. సినిమాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.

సీనియర్ నటి జయలలిత మాట్లాడుతూ.. ‘ఇంత మంది వచ్చి మా సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. సెప్టెంబర్ 22న ఈ చిత్రం రాబోతోంది. ప్రేక్షక దేవుళ్లు మా సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంద‌ర్భంగా శివ శంక‌ర్ మాస్టర్‌గారికి ధ‌న్య‌వాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయ‌న మా కోసం రెండు పాట‌ల‌కు అద్భుతంగా కొరియోగ్ర‌ఫీ చేశారు’ అని అన్నారు.

హీరో నిర్మాత అనీల్‌ అర్క మాట్లాడుతూ.. ‘మా కోసం వచ్చిన శ్రీకాంత్ గారికి, రాశీ గారికి, సుచి అమ్మకు థాంక్స్. వీళ్ల రాకతో చిన్న సినిమా పెద్ద సినిమా అయింది. ఆడియెన్స్ కూడా ఈ సినిమాను చూసి ఆదరించి పెద్ద సినిమాగా చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

సుచిత్ర మాట్లాడుతూ.. ‘నేను డ్యాన్స్ మాస్టర్‌గా జయలలితగారు నటించిన ఎన్నో సినిమాలకు పని చేశాను. ఇప్పుడు ఆవిడకు నిర్మాతగానూ రూపొందించిన సినిమాకు కొరియోగ్రఫీ చేయటం చాలా హ్యాపీగా ఉంది’ అని అన్నారు.

లిరిక్ రైటర్ సాగర్ మాట్లాడుతూ.. ‘కోన రాము గారు నాకు పదిహేనేళ్ల అనుబంధం ఉంది. అనిల్ నా తమ్ముడు మొదట్లో నిర్మాత, ఇప్పుడు హీరోగా మారాడు. ఈ సినిమాకు మంచి పాటలు రాశారని అనుకున్నాను. నేను రాసిన వాటిల్లో గీతగోవిందం పెద్ద హిట్ అయింది. నా డైరెక్టర్ రాము వల్లే పాటలు ఇంత బాగా వచ్చాయ’ని అన్నారు.

రామ్ లక్ష్మణ్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మేం కూడా చిన్న చిన్న చిత్రాల్లో చేశాం. ఆ కష్టం ఎలా ఉంటుందో మాక్కూడా తెలుసు.. ఈ సినిమా టీజర్, ట్రైలర్ బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. బంగారు తల్లి అద్భుతంగా నటించింది. రాము గారు సీరియల్స్ చేశారు. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చారు. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. జనాలకు నచ్చితే అన్ని చిత్రాలు పెద్దవే. శ్రీకాంత్ గారు గెస్టుగా రావడం ఆనందంగా ఉంది. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

డైలాగ్ రైటర్ రంగా మాట్లాడుతూ.. ‘రుద్రం కోట ఈవెంట్‌కు వచ్చిన శ్రీకాంత్ గారికి థాంక్స్. మన సమాజంలో పెళ్లి, మూడుముళ్లకు ఓ గొప్పదనం, పవిత్రత ఉంది. దాన్ని అపహాస్యం చేస్తే రుద్ర సాయంతో కోటమ్మ ఏం చేసిందనేది ఈ మూవీ కథ’ అని అన్నారు.

హీరోయిన్ విభీష మాట్లాడుతూ.. ‘శ్రీకాంత్, రాశీ గారి సినిమాలెన్నో చూశాను. రామ్ లక్ష్మణ్ మాస్టర్‌ల ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. సుచిత్ర మేడం ఎంతో సహనంతో మాతో స్టెప్పులు వేయించారు. నాకు ఛాన్స్ ఇచ్చిన రాము, అనిల్ సర్‌లకు థాంక్స్. మా జయమ్మ మాకు అమ్మలా మారిపోయారు. మేం ఎంతో ఇష్టంతో కట్టిన కోట రుద్రం కోట. ప్రేక్షకులు చూసి ఆదరించాల’ని కోరారు.

అలేఖ్య మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన రాము, అనిల్ గారికి థాంక్స్. సినిమాను ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాం. సెప్టెంబర్ 22న చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.