వందకు పైగా థియేటర్లలో రీ రిలీజవుతోన్న ‘రఘువరన్ బీటెక్’

జాతీయ పురస్కార గ్రహీత ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రఘువరన్ బీటెక్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలుగులో విడుదల చేశారు. జనవరి 1, 2015లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

తమిళంలో జులై 18, 2014లోనే ‘వేలై ఇళ్ళ పట్టదారి’ విడుదలైంది. విద్యార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, ఆ కాన్సెప్ట్ నచ్చడంతో ‘స్రవంతి’ రవికిశోర్ తెలుగులో విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకూ సినిమా నచ్చడమే కాదు, ధనుష్ కంటూ మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడీ సినిమాను శుక్రవారం (ఆగస్టు 18న) రీ రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం… ప్రతి ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.

‘రఘువరన్ బీటెక్’ రీ రిలీజ్ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”కొన్ని సినిమాలను ఎవర్ గ్రీన్ మూవీస్ అంటుంటాం. అటువంటి చిత్రమే ‘రఘువరన్ బీటెక్’. ప్రతి తరంలోని విద్యార్థులకు కనెక్ట్ అయ్యే చిత్రమిది. స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్, కెరీర్ స్ట్రగుల్స్ గురించి బాగా డిస్కస్ చేశారు. ప్రముఖ దర్శకుడు కిశోర్ తిరుమల తెలుగు డైలాగ్స్ రాశారు. డబ్బింగ్ డైలాగ్స్ తరహాలో కాకుండా ఆయన రాసిన మాటలన్నీ ఒరిజినల్ సినిమాకు రాసినట్టు రాశారు. ధనుష్ అయితే పాత్రలో జీవించారు. ఆయనలో చాలా మంది విద్యార్థులు తమను తాము చూసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇప్పటికీ చూసుకుంటున్నారని అనిపిస్తోంది. ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అనిరుధ్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఎక్స్‌ట్రాడినరీ సాంగ్స్ అందించారు. రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. తెలుగులో అనిరుధ్ ఫస్ట్ హిట్ ఇది. ఈ సినిమా తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది” అని అన్నారు.

ధనుష్ సరసన అమలాపాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సురభి కీలక పాత్రధారి. హీరో తల్లిదండ్రులుగా శరణ్య, సముద్రఖని నటించారు. వివేక్, హృషికేష్, అమితాష్ ప్రధాన్ ఇతర తారాగణం. వేల్ రాజ్ దర్శకత్వం వహించారు.