‘పుష్ప’ చిత్రానికి ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా వుంది: మైత్రీ మూవీ మేకర్స్

”అల్లు అర్జున్ గారికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం అనందంగా వుంది. 69ఏళ్లలో తొలిసారి ఒక తెలుగు హీరోకి జాతీయ అవార్డు రావడం, అందులోనూ మేము నిర్మించిన పుష్ప చిత్రానికి ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా వుంది. ఇదొక చరిత్రగా నిలిచిపోతుంది”అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలో ఒకరైన నవీన్ యెర్నేని.

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘పుష్ప: ది రైజ్‌’, ఉప్పెన చిత్రాలు 2021 సంవత్సరానికి గానూ మూడు జాతీయ జాతీయ వార్డులని కైవశం చేసుకున్నాయి. ‘పుష్ప: ది రైజ్‌’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సొంతం చేసుకున్నారు. జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. అలాగే ‘పుష్ప’ చిత్రానికి సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీతం దర్శకుడిగా అవార్డ్ ని సొంతం చేసుకున్నారు. అలాగే జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ చిత్రం అవార్డ్ ని కైవశం చేసుకుంది. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ… అల్లు అర్జున్ గారి జాతీయ అవార్డ్ రావడం మాకు ఎంతో అనందంగా గర్వంగా వుంది. పుష్ప సినిమా షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ గారు తప్పకుండా నేషనల్ అవార్డ్ కొడతారని సుకుమార్ గారు అనేవారు. అది ఈ రోజు నిజమైయింది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి జాతీయ అవార్డ్ రావడం అనందంగా వుంది. పుష్ప మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేవిశ్రీ మాకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే ఉప్పెన సినిమాకి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డ్ రావడం గర్వంగా వుంది. దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్ కృతి శెట్టి , విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్, టీం అందరికీ అభినందనలు. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రానికి దాదాపుగా ఆరు అవార్డులు రావడం సంతోషంగా వుంది. జాతీయ అవార్డు విజేతలు అందరికీ పేరుపేరునా అభినందనలు” తెలిపారు

వై రవిశంకర్ మాట్లాడుతూ.. పుష్ప, ఉప్పెన మా బ్యానర్ లో చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు. రెండు చిత్రాలు కమర్షియల్ గా హిట్ కావాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. చిరంజీవి గారు మొదటి ఉప్పెన కథ విని బావుందని చెప్పి ఎంతో ప్రోత్సహించారు. బుచ్చిబాబు సానా అద్భుతంగా తీశారు. 70 ఏళ్ల చరిత్రలో జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా పుష్ప తో అల్లు అర్జున్ గారు చరిత్ర సృష్టించారు. మాకే కాదు తెలుగు సినిమా చరిత్రలో ఇది ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉప్పెన , పుష్ప రెండు చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు పుష్ప ద్వారా దేవిశ్రీ ప్రసాద్ గారి అవార్డ్ రావడం అనందంగా వుంది. ఉప్పెన, పుష్ప ఈ రెండు విజయాల్లో సింహ భాగం సుకుమార్ గారిదే. ఇక ఆర్ఆర్ఆర్, కొండపొలం చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. జాతీయ అవార్డులు పొందిన అందరికి పేరుపేరునా అభినందనలు” తెలిపారు

దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ .. నా తొలి సినిమాకే జాతీయ అవార్డ్ రావడం ఆనందంగా వుంది. నిర్మాతలు నవీన్ గారికి, రవి గారికి, మా గురువు గారు సుకుమార్ గారికి కృతజ్ఞతలు. చిరంజీవి గారు ఈ కథ విన్న తర్వాత తప్పకుండా దీనికి జాతీయ అవార్డ్ వస్తుందని చెప్పారు. ఆయన మాట నిజమైయింది. హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్ కృతి శెట్టి , విజయ్ సేతుపతి గారికి, తన మ్యూజిక్ తో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళిన దేవిశ్రీ ప్రసాద్ గారి ధన్యవాదాలు” తెలిపారు.