కాకర్ల కృష్ణ అంచెలంచెలుగా ఎదిగాడని నటుడు మాగంటి మురళి మోహన్ చెప్పారు.

1974లో కె. సత్యం దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, అంజలీదేవి, చంద్రకళ తో కాకర్ల కృష్ణ రూపొందించిన ఇంటింటి కథ సినిమా విడుదలై 50 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో కృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి.

కాజా సూర్యనారాయణ, పరుచూరి గోపాల కృష్ణ, కోమటిరెడ్డి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్మాత కాకర్ల కృష్ణను ఫిలిం నగర్ దైవ సన్నిధానం వేద పండితులు ఆశీర్వదించారు.

ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత, నటుడు మాగంటి మురళి మోహన్ మాట్లాడుతూ.. కృష్ణ, నేను ఓ 1940 లో జన్మించాము, ఇద్దరం సినిమా పరిశ్రమలో క్రింది స్థాయి నుంచి ఎదిగాము, రాజేంద్ర ప్రసాద్ గారి జగపతి సంస్థ లో కృష్ణ ప్రొడక్షన్ మేనేజర్ గా విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. ఆ తరువాత ఇంటింటి కథ సినిమాతో నిర్మాత గా మారారు, ఆ తరువాత ఏడంతస్తుల మీద, ఊరంతా సంక్రాంతి, రాగ దీపం, మొదలైన సినిమాలో బాగా స్వామిగా పనిచేశారని మురళీ మోహన్ చెప్పారు. హైదరాబాద్ వచ్చిన తరువాత రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ప్రారంభమైన ఫిలిం నగర్ దైవ సన్నిధానం లో నాతో పాటు కృష్ణ కూడా కమిటీలో వుంది దేవాలయానికి సేవలందించారని చెప్పారు.

రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. కృష్ణ మా అందరికీ ఆత్మీయుడు, ఆయన స్వర్ణోత్సవం జరగడం ఎంతో సముచితంగా, సంతోషంగా ఉందని అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షుడు కానూరి దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. మా నాన్న గారు రంజిత్ కుమార్ గారు, కృష్ణ గారు మంచి మిత్రులు, ఆయన స్వర్ణోత్సవం మా అందరికీ పండుగలా ఉందని చెప్పారు.

కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఫిలిం నగర్ గృహ నిర్మాణ సంస్థ, ఫిలిం నగర్ దైవ సన్నిధానం లో మాతో పాటు పని చేశారని చెప్పారు. 40 సంవత్సరాలుగా కాకర్ల కృష్ణ కృష్ణ తనకు తెలుసునని, ఆయన ఎదుగుదలను తాను చూశానని దర్శకుడు రేలంగి నరసింహరావు చెప్పారు. కాకర్ల కృష్ణను ఆత్మీయులు ఘనంగా సత్కరించారు. ఇంతమంది ఆత్మీయల సమక్షంలో తన స్వర్ణోత్సవం జరగడం ఎంతో సంతోషంగా ఉందని, జీవితాంతం తీపి జ్ఞాపకం గా ఉంటుందని కాకర్ల కృష్ణ చెప్పారు.

కృష్ణ మనుమడు త్రికాంత్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నిర్మాత అభిషేక్, రామ సత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, కెమెరామన్ నవ కాంత్, నిరంజన్, మేకప్ మాధవ రావు, ఛాయాగ్రాహకుడు హరనాథ్, జర్నలిస్టులు భగీరథ, ఉమామహేశ్వర రావు, గోరంట్ల సురేష్, గోపాల రావు, బాలరాజు, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.