‘నంది’ అవార్డు వేడుకతో ఎలాంటి సంబంధం లేదు

నంది అవార్డులపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఓ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న దుబాయ్‌లో జరిగే నంది అవార్డ్‌ వేడుకకు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఎలాంటి సంబంధలేదని తెలిపింది. దుబాయ్‌లో జరిగే నంది అవార్డుల వేడుక ప్రతాని రామకృష్ణ గౌడ్‌ వ్యక్తిగతమని పేర్కొంది. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఏపీస్టేట్ ఫిల్మ్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఈ ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము.

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి మాతృసంస్థ, మరియు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తించబడిన సంస్థలు అని మరోసారి తెలియజేస్తున్నాం. ముఖ్యముగా తెలియజేయునది ఏమనగా 24-09-2023న దుబాయ్‌లో నిర్వహించబడే టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి పైన తెలియజేసిన రెండు ఛాంబర్‌లకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఈవెంట్‌లో మేం భాగం వహించము. ఇది తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ పి. రామకృష్ణ గౌడ్‌ నిర్వహించే వ్యక్తిగత మరియు ప్రైవేట్‌ ఈవెంట్‌. ఇది

తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఛాంబర్‌ కాదు. నంది అవార్డు అనేది ఆంధ్ర రాష్ట్రానికి పేటెంట్‌ అయినందున, నంది అనే పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫ్‌సీసీ నంది అవార్డుల ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని అందరికీ తెలియజేస్తున్నాం’’ అని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవ కార్యదర్శి కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి కె.అనుపమ్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.