అత్యధిక థియేటర్‌లలో ‘నరసింహ నాయుడు’ రీ రిలీజ్‌

నందమూరి బాలకృష్ణ హీరోగా బి.గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌హిట్‌ చిత్రం ‘నరసింహ నాయుడు’ మరోసారి ప్రేక్షకుల్ని అలరించనుంది. బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 10న 4కె వెర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘నరసింహనాయుడు’ హిస్టారీ సృషించిన చిత్రం. ఇప్పుడీ చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి 1000 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని అన్నారు.

మేడికొండ మురళీకృష్ణ మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ, బి. గోపాల్‌ ఎంత పెద్ద హిట్‌ కాంబినేషనో అందరికీ తెలిసిందే. నరసింహనాయుడు వీర్దిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం. ఆ రోజుల్లో ఎంత ఘన విజయం సాధించిందో విధితమే. ఈ చిత్రం ద్వారా నేను కూడా జనాలు అందరికీ తెలిశాను. ఇప్పుడు రీ రిలీజ్‌ ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. మళ్లీ ఈ చిత్రం ఓ సెన్షేషన్‌ అవుతుంది’’ అని అన్నారు.

బి.గోపాల్‌ మాట్లాడుతూ ‘‘నరసింహనాయుడు’ నాకెరీర్‌లో మరచిపోలేని చిత్రం. బాలయ్య అద్భుతంగా నటించారు. ఎమోషన్స్‌, యాక్షన్‌ పరంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తీరు మరచిపోలేను. కత్తులతో కాదురా… కంటి చూపులతో చంపేస్తా’ అన్న డైలాగ్‌ బాలయ్య చెబితేనే బావుంటుంది. ఆ డైలాగ్‌ను ఇప్పటికీ జనాలు మరచిపోలేదు. కథ, పరుచూరి బ్రదర్స్‌, పాటలు, డాన్స్‌లు, మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. విజయవాడలో చేసిన వంద రోజుల ఫంక్షన్‌ని ఎప్పటికీ మరచిపోలేను. బాలయ్య ప్రజెంట్‌ ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేస్తున్నారు. అన్‌స్టాపబుల్‌ అంటూ దూసుకెళ్తున్నారు’’ అని అన్నారు.