Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సంచలనం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 6 రోజుల క్రితం థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రోజులు గడిచే కొద్దీ మరింత జోరుగా దూసుకెల్తుతోంది. కుటుంబ ప్రేక్షకులలో చిరంజీవికి ఉన్న అద్భుతమైన ఆదరణ, అనిల్ రావిపూడి అదిరిపోయే కథనం, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర, కథానాయికగా నయనతార ఆకట్టుకునే నటన కలగలిసి థియేటర్లలో పండగ నెలకొంది.
బిగ్ ఫిలిమ్స్ సాధించడానికి వారాలు పట్టే విజయాన్ని ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కేవలం ఆరు రోజుల్లోనే సాధించింది. ఈ చిత్రం దేశీయంగా, విదేశాలలో అన్ని ప్రాంతాలలో కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అద్భుతమైన 261 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, 300 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం ‘దే కాల్ హిమ్ ఓజీ’ (2.78 మిలియన్లు) ఫైనల్ సేల్స్ ని అధిగమించి, 6 రోజుల్లో 2.81 మిలియన్లకు పైగా టిక్కెట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఏపీ, తెలంగాణలో అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రాలలో ఈ చిత్రం 13.85 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 14.05 కోట్ల షేర్తో అగ్రస్థానంలో ఉంది. అంతకుముందు, ఈ చిత్రం ఐదవ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి, RRR యొక్క ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టింది.
విదేశాలలో కూడా ఈ చిత్రం అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఉత్తర అమెరికాలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఇప్పటికే 2.6 మిలియన్ డాలర్ల మార్కును దాటింది, ఆ ప్రాంతంలో చిరంజీవికి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి, అతని మునుపటి అత్యుత్తమ చిత్రం ‘సైరా’ రికార్డును అధిగమించింది. త్వరలోనే 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించబోతోంది. ఇది అనిల్ రావిపూడికి కూడా ఓవర్సిస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుంది.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ కేవలం సంక్రాంతి విజేత మాత్రమే కాదు, రీజనల్ చిత్రాలలో ఇండస్ట్రీ హిట్గా నిలుస్తోంది. చిరంజీవి తెలుగు సినిమాకు అల్టిమేట్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నారు.

