జీవితంలో ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ బాగుండాలి అదే ‘మళ్లీ పెళ్లి’ : నరేష్‌

నవరస రాయ డా. నరేష్ వి.కె ,గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథ తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయిక. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన ,దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా దీనిని నిర్మించారు. మే 26న సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

అందులో భాగంగా మళ్లీ పెళ్లి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌ లోని జె.ఆర్‌.సి. ఫంక్షన్‌ హాల్‌ లో ఘనంగా జరిగింది. కృష్ణ, విజయనిర్మల ఫొటోలకు జ్యోతి ప్రజ్వలన గావించడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం ‘ఆకాశమే..’ అనే సాంగ్‌ ను జయసుధ లాంఛ్‌ చేశారు. యాభై ఏళ్లు నటిగా పూర్తిచేసుకున్న జయసుధను నరేష్‌ దంపతులు ఈ సందర్భంగా సన్మానించారు. ఈ వేడుకలో మళ్లీ పెళ్లి చిత్ర బిగ్‌ టికెట్‌ ను జయసుధ లాంఛ్‌ చేశారు. అలాగే నటుడిగా యాభైఏళ్ళు పూర్తిచేసుకున్న నరేష్‌ గారిని ఎం.ఎస్‌.రాజు ఆద్వర్యంలో జయసుధ సత్కరించారు.

అనంతరం జయసుధ మాట్లాడుతూ, ఇది నాకు చాలా స్పెషల్‌ ఈవెంట్‌. ఎందుకంటే 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం ఇండస్ట్రీలో అందరికీ కుదరదు. నాకు, నరేష్‌ కు దక్కిన అద్టృష్టం ఇది. విజయనిర్మలగారు పండంటి కాపురంలో నన్ను, నరేష్‌ ను నటులుగా పరిచయం చేశారు. ఆ తర్వాత మేము ఇద్దరమూ విడివిడిగా హీరో హీరోయిన్లుగా వందల సినిమాలు చేశాం. మంచి నటులు అని పేరు తెచ్చుకున్నాం. నరేష్‌ తో నిర్మాతగా అదృష్టం అనే సినిమా తీశా. ఆ కథ అడ్వాన్స్‌ ట్రెంఢీ గా ఉంటుంది. ఇక మళ్లీ పెళ్లి లో మేమిద్దరం నటించడం చాలా ఆనందంగా వుంది. అలాగే ఎం.ఎస్‌.రాజుగారి ప్రొడక్షన్‌ లో తీసిన ‘వాన’ సినిమాలో వైవిధ్యంగా మమ్మల్ని భార్యభర్తలుగా నటింపజేశారు. అలాగే ఎం.ఎస్‌.రాజుగారు మరిన్ని వైవిధ్యమైన సినిమాలు తీయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. పర్సనల్‌ విషయాలపరంగా మనం ఎవరికీ భయపడనక్కరలేదు. మే 26న ఈ సినిమాకు బిగ్‌ ఓపెనింగ్‌ వుంటుందని భావిస్తున్నాను అన్నారు.

నరేష్‌ మాట్లాడుతూ.. నా బ్యాంక్‌ లో ఐదువేలు లేని రోజులు నాకు గుర్తు. నా ప్రాణమిత్రుడు విజయ్‌ నాకు తోడుగా వున్నాడు. నాకు తెలిసి చిన్నప్పుడు కృష్ణ, విజయ నిర్మల గారిని చూసేందుకు తిరుపతి గుండు తో అభిమానులు దర్శించుకునేవారు. 9వ ఏట పండంటి కాపురం తో అనుకోకుండా నా నటన ప్రారంభమైంది. ఎస్‌.వి.రంగారావు, గుమ్మడి, జయసుధ గారితో కలిసి పయనమే ఇప్పుడు 50వ ఏట హెల్దీగా నటుడిగా కొనసాగుతున్నానని అనిపిస్తుంది. మా అమ్మ నాతో నీకు మంచి లైఫ్‌ ఇవ్వలేకపోయాను అని చివరిలో అంది. ఇప్పుడు నేను ఇంకో అమ్మని కలిశాను అని చెప్పి కృష్ణ గారి ఆశీస్సులు తీసుకున్నాను. ఫస్టాప్‌ బాగుంటే సెకండాఫ్‌ బాగుంటుంది. అదే ఈ సినిమా. కృష్ణ, విజయనిర్మలగారు నాకు ధైర్యాన్ని నేర్పారు. ఆ సమయంలో నా కుటుంబమంతా నా వైపు నిలబడింది. మా అమ్మ ఓ దేవత. ఆమె నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. రీల్‌ లైఫ్‌ బాగున్నా రియల్‌ లైప్‌ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ తర్వాత ఇంకో అమ్మను కలుసుకున్నా. పెండ్లి లో నమ్మకం, ఆప్యాయత, తోడును కోరుకుంటాం. వృద్ధాప్యంలో బలాన్ని కోరుకుంటాం. అందుకే చివరికి నా గమ్యానికి చేరుకున్నానని చెప్పగలను. నా గురువు జంధ్యాల గారు మంచి మిత్రులు. ఆయన సినిమాలతో అన్నీ హిట్లు కొడుతూనే వచ్చాను. నాకు నచ్చింది నేను చేస్తాను. మా అమ్మ గుడికి వెళ్ళి అమ్మ కళ్ళలో చూస్తాను. నాకు ఆలోచన వస్తుంది అదే చేస్తాను. రాజకీయాల్లోకి వెళ్ళాను. సేవా కార్యక్రమాలు చేశాను. ఒక సిద్ధాంతంతో బిజెపి లో పనిచేశాను. అయినా తృప్తి లేదు. మరలా కళామతల్లి వైపు వచ్చాను. నన్ను మెచ్చిన దర్శక నిర్మాతలు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. నేను రోజూ వ్యాయామం చేస్తాను.మైండ్‌ ఆరోగ్యంగా వుంటే మనం ఆరోగ్యంగా వుంటాం. పదిమందికి మంచి చేయాలి. అదే లైఫ్‌. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ లో మంచి పనికోసం పనిచేశాను. సభ్యుల సహకారంతో ముందుకు సాగాను.

ఒకప్పుడు ఎం.ఎస్‌.రాజుగారి సినిమాలో నటించాలకునేవాడిని. అలా వదిన వరస అయిన జయసుధ తో వాన సినిమాలో భార్యభర్తలుగా చేయించారు. డర్టీహరీ సినిమా చూశాక అందులో యంగ్‌ మాన్‌ ఆయనలో కనిపించాడు. ఆయనతో కొంతకాలం జర్నీ చేశాక ఓ కథ వినిపించారు. బాగా నచ్చి వెంటనే చేద్దాం అన్నా. అమ్మ కోరిక మేరకు విజయకృష్ణ గ్రీన్‌ స్టూడియో స్థాపించాం. ఇక ఈ సినిమా ఎం.ఎస్‌.రాజుగారు కాకపోతే మొదలయ్యేది కాదు. ట్రైలర్‌ లో కొద్దిగానే చూశారు. విడుదలయ్యాక ఆటంబాంబ్‌ పేలుతుంది. మే 26 న యు.ఎస్‌.ఎ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లలో విడుదల కాబోతుంది. ఇది తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తీశాం. వనితా పాత్ర ద్వారా సూర్యకాంతం ఛాయాదేవి మనకు వచ్చిందని అనుకుంటున్నా. అరుణ్‌దేవ్‌,అనంత్‌ శ్రీరామ్‌, సురేష్‌ బొబ్బిలి బాగా పనిచేశారు అని అన్నారు.

పవిత్ర లోకేష్‌ మాట్లాడుతూ, నాది ఇప్పటినుంచి కొత్త లైఫ్‌. ప్రతివారికి చిన్నప్పటినుంచి ఓ డ్రీమ్‌ వుంటుంది. అలా నాకూ ఓ డ్రీమ్‌ వుంది. అందుకే సినిమా రంగానికి వచ్చాను. చిన్నతనంలో పేరెంట్స్‌ను కోల్పోయా. నటిగా కష్టపడుతూ సౌకర్యాలను సమకూర్చుకున్నా. ఆ క్రమంలో కొన్ని దుష్టశక్తులు నన్ను పడగొట్టేందుకు ప్రయత్నించాయి. అప్పడు నాకు ఒక శక్తిగా నరేష్‌ గారు నిలబడ్డారు. ఇప్పుడు పాతది బ్రేక్‌ అయింది. దేవుడు అంతా సవ్యంగా ఉండేలా చేశాడు. మహాతల్లి విజయనిర్మల సంస్కారాన్ని నేర్పింది. ఆమె దీవెనలు వున్నాయి. విజయకృష్ణ మూవీస్‌ లో పలు సినిమాలు తీయాలని మొదలు పెట్టాం. ఇదంతా పెద్దల ఆశీర్వాదం తో జరిగింది. కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్‌కూడా నన్ను అంగీకరించారు. అందుకే అన్ని మంచిగా జరుగుతున్నాయి.

ఇక మళ్లీ పెళ్లి గురించి చెప్పాలంటే, రాజుగారు, నరేష్‌ గారు సినిమా తీయాలని డిసైడ్‌ చేసుకున్నారు. నేను అందులో ఓ భాగం మాత్రమే. ప్రతి విషయాన్ని చాలా సీరియస్‌ గా తీసుకుని నాకు వివరించారు ఎం.ఎస్‌.రాజుగారు. వనితా మంచి పెర్‌ఫార్మర్‌. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్‌ చెబుతున్నాని అన్నారు.

ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ, ఈ స్టేజీ పై దండలు మార్చుకుని మళ్లీ పెళ్లి చేసుకోవడం బాగుంది. వనితా విజయ్‌కుమార్‌ దేవీ సినిమాలో పాత్రకు ప్రాణం పోసింది. ఇప్పుడు ఈ సినిమాలో నటించింది. నేను 12 ఏళ్ళప్పుడు మీనా సినిమా చూశాను. కానీ ఇప్పుడు వారి బేనర్‌ లో సినిమా చేస్తానని అనుకోలేదు. ఇది బోల్డ్‌ కథ అని కచ్చితంగా చెప్పగలను అన్నారు.

సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ, ఈ సినిమా టైటిల్‌ నాకు బాగా నచ్చింది. నాకు ఎం.ఎస్‌.రాజుగారు కథ చెప్పారు. ఇక ఎవరు ఏమనుకున్నా ఈ సినిమాను అందరూ తప్పకుండా చూస్తారు. సొసైటీ లో 90 ఏళ్ళు అయినా పెండ్లి చేసుకుంటున్న సందర్భాలున్నాయి. దానికి కారణం ఒంటరితనం భరించలేక పలకరింపు కోసమే అలా చేసుకుంటున్నారు. ఇప్పుడు యంగర్‌ జనరేష్‌ కొంత కాలం కలిసి వుండి ఆ తర్వాత పెండ్లి చేసుకుంటున్నారు. ఫైనల్‌ గా ఎప్పుడైనా మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిందే అని అన్నారు.

గీత రచయిత అనంత్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ, ఈ సినిమాకు పనిచేయడం విచిత్ర అనుభూతి. ఎందుకంటే ఎం.ఎస్‌.రాజు గారు ఈ సినిమాను ఇలా తీశాను. దానికి పాటలు రాయమని చెప్పారు. బంగారు పంజరం లాంటి సినిమా ఇది. ఇక ఈ సినిమాను చూసేముందు నరేష్‌ గారి కథ చూడబోతున్నాను అనుకున్నాను. కానీ బయటకు వచ్చాక నరేష్‌ కథ చూడలేదు. ఎంఎస్‌.రాజు గారి కావ్యం చూశానని పించింది. ఉత్కంఠ రేపే కథను చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది. మదిలో మెదిలే విషయాలను చెప్పాలంటే మనోధైర్యం వుంటే సరిపోతుంది. కానీ గదిలోని విషయాలు చెప్పాలంటే అందుకు గట్స్‌ కావాలి. ప్రతివారి జీవితంలో రహస్యాలుంటాయి. వాటిని దాచుకుంటాం. కానీ ఈ సినిమాలో వీరు ధైర్యంగా రహస్యాల్ని బయట పెట్టారు. అది నాకు స్పూర్తి కలిగించింది. ఇక సాహిత్యపరంగా నాకు చాలా ఉపయోగపడింది. కొన్ని దశాబ్దాల క్రితం ‘కదిలే కాలమా’ అనే పాట వచ్చింది. అందుకే ఇందులో ‘ఉరిమే కాలామా’ అని రాయాల్సి వచ్చింది. సినీ సాహిత్యానికి పోషకులు ఎం.ఎస్‌.రాజుగారే అని ఒకప్పుడు సీతారామశాస్త్రి గారు అంటుండేవారు.. కవులకు గౌరవం ఇస్తే చాలు అన్న ధోరణి నుంచి పాటకు లక్ష ఇచ్చే స్థాయికి తెచ్చింది రాజుగారే. అప్పటినుంచే పాటల రచయితలకు గౌరవం, దైర్యం పెరిగింది. నిర్మాత, దర్శకుడు కనుక ఆయన బాగా సినిమా తీశారనిపించింది అని అన్నారు.

సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి మాట్లాడుతూ, ఇద్దరు లెజెండ్స్‌ తో కలిసి పనిచేసే ఛాన్స్‌ వచ్చింది. మే26న సినిమా చూసి ఆశీర్వదించండి అన్నారు.

అరుల్‌ దేవ్‌ మాల్లాడుతూ, థ్యాంక్స్‌ చెప్పారు.

దర్శకుడు, నటుడు వెంకటేష్‌ మహా మాట్లాడుతూ, ఈ సినిమాకు గెస్ట్‌ గా రావడం గర్వంగా వుంది. దర్శకుడిగా ఎం.ఎస్‌.రాజుగారు నాకు స్ఫూర్తి. యూత్‌ దర్శకులకు కూడా ఇన్‌స్పైర్‌ గా ఆయన డర్టీహరీ సినిమా తీశారు. ఇక నరేష్‌ గారు నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఆయన నిజ జీవితంలో మంచి మానవతావాది. ఆయనతో రెండు సినిమాలకు పని చేశాను. ఏదైనా చిన్న సంఘటన జరిగినది అనగానే వెంటనే కళ్ళు చెమరుస్తారు. ఆయన హృదయం అలాంటిది. రెండు సీన్సు డబ్బింగ్‌ సందర్భంగా చూశాను. చాలా కొత్తగా వుండే కథ ఇది. అన్నదమ్ములుగా ఏక్ట్‌ చేశాం. ఇందులో పనిచేసిన టెక్నిషియన్స్‌కు థ్యాంక్స్‌ అని అన్నారు.

వనితా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, 25 ఏళ్ళ తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎం.ఎస్‌. రాజుగారికి థ్యాంక్స్‌. ఆయన చెప్పిన పాత్రను పోషించాను. మాయదారి మల్లిగాడు లో అమ్మ మంజుల గారు కృష్ణ గారితో పనిచేశారు. నేను 2023లో నరేష్‌, పవిత్రతో కలిసి నటించాను. పవిత్ర వండర్‌ ఫుల్‌ మదర్‌ అని అన్నారు.

రోషన్‌ మాట్లాడుతూ, నేను ఇందులో భాగమైనందుకు ఆనందంగా వుంది. ఎం.ఎస్‌.రాజుగారితో ఇది నా మూడో సినిమా అన్నారు.

అనన్య మాట్లాడుతూ, వకీల్‌ సాబ్‌ తర్వాత యాక్టర్‌ గా మంచి పాత్రలు చేస్తుందని అన్నారు. అప్పటి నుంచి నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. ఎం.ఎస్‌.రాజుగారు ఈ సినిమాలో భిన్నమైన పాత్రను చేయించారు. గ్లామరస్‌ గా కూడా నన్ను చూపించారు. అదేవిధంగా నా ఆలోచనలు కూడా ఈ సినిమా చేశాక మార్పు వచ్చింది. నరేష్‌గారు పెర్‌ఫార్మెన్స్‌ పీక్‌ లోకి తీసుకెళ్లారు అని అన్నారు.

నటుడు రవివర్మ మాట్లాడుతూ, నా ఫస్టాఫ్‌ లో విజయనిర్మలగారి దర్శకత్వంలో నేరము శిక్ష చేశాను. మీ శ్రేయోభిలాషిలో నరేష్‌ గారితో నటించాను. సెకండాప్‌ బెటర్‌ అనేందుకు ఈ సినిమాలో నటించడమే. మే 26న కలుద్దాం అన్నారు.

జడ్జి మాధవరావు మాట్లాడుతూ, ప్రేక్షకులే నా దృష్టిలో జడ్జిలు. మళ్లీపెళ్లికి క్రేజ్‌ రావడానికి మీడియానే కారణం. బాహుబలికి బజ్ రావడానికి మీడియానే కారణం. మనిషి జీవితానికి సెకండాఫ్‌ అనేది కీలకం అని ఎం.ఎస్‌.రాజుగారు ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ను అభినందిస్తున్నాను అన్నారు.

వెంకట్రావ్‌ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా నరేష్‌ తో స్నేహం. నరేష్‌ ద్వారానే విజయనిర్మలగారితో పరిచయం ఏర్పడింది. . 50 ఏళ్ళుగా సినీరంగంలో వుంటూ మళ్లీ పెళ్లి అనే సినిమాతో సరికొత్తగా రాబోతున్నారు. నరేష్‌ గొప్ప మానవతావది, సేవాదృక్పతం వున్న వ్యక్తి. అన్నారు.

ఇంకా సినిమాటోగ్రాఫర్‌ బాల్‌రెడ్డి, ఎడిటర్‌ జునైద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ భాస్కర్‌, కరాటే కళ్యాణి, గౌతంరాజు, అశోక్‌ కుమార్‌, అనన్య, రోషన్‌, రవివర్మ, జడ్జి మాధవరావు ప్రత్యేక అతిథి. వెంకట్రావ్‌, వనితా విజయ్‌కుమార్‌, శివబాలాజీ పాల్గొన్నారు.