తెలుగులో ‘దీపావళి’గా తమిళ సినిమా ‘కిడ’- నవంబర్ 11న రిలీజ్

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో ‘దీపావళి’గా అనువదిస్తున్నారు. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘లేడీస్ టైలర్’ సినిమాతో స్రవంతి మూవీస్ సంస్థ తొలి అడుగు వేసింది. ఈ 38 ఏళ్ళ ప్రయాణంలో ‘స్రవంతి’ రవికిశోర్ 38 చిత్రాలను నిర్మించారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని కథను నమ్మి సినిమాలు తీస్తున్నారాయన. స్రవంతి మూవీస్ సంస్థలో 38వ సినిమా ‘కిడ’. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

‘దీపావళి’లో ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే, అందమైన ప్రేమకథ కూడా ఉంది. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు వెంకట్ రాసిన కథ నచ్చడంతో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించడానికి ముందుకొచ్చారు. ‘దిల్’ రాజు ఏ విధంగా అయితే ‘బలగం’ తీశారో… ఆ తరహాలో మానవ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’.

‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ: ”చెన్నై వెళ్ళినప్పుడు ఓ స్నేహితుడి ద్వారా ఐదు నిమిషాల పాటు ఈ సినిమా కథ విన్నా. వెంటనే కనెక్ట్ అయ్యాను. దర్శకుడిని కథ మొత్తం రికార్డ్ చేసి పంపమని అడిగా. కథ నచ్చడంతో ఓకే చేశా. దర్శకుడికి తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అతడు స్క్రిప్ట్ ఏదైతే రాశాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం ” అని అన్నారు ‌.

చిత్ర దర్శకుడు ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ: ”తాతయ్య, మనవడు, ఓ మేకపిల్ల… మూడు పాత్రల మధ్య భావోద్వేగాలు ‘దీపావళి’లో ప్రధానాంశం. తమిళనాడులో దీపావళిని సంబరంగా జరుపుతారు. నా చిన్నతనంలో మా అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగాను. బాల్యంలో జరిగిన సంఘటనల స్పూర్తితో ఈ సినిమా తీశా. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లాలో ఓ గ్రామంలో కథ జరుగుతుంది. అన్ని భాషల ప్రేక్షకులకు ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. ‘స్రవంతి’ రవికిశోర్ గారు లాంటి నిర్మాత లభించడం నా అదృష్టం. నాకు ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నాకు ఏం కావాలో అది సమకూర్చారు. ఆయనకు చాలా థాంక్స్” అని అన్నారు.

ఈ చిత్రానికి దాదాపుగా అందరూ కొత్తవాళ్ళు పని చేశారు. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు… ఇలా చాలా మందికి తొలి చిత్రమిది.

పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆడియోగ్రాఫర్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : కె.బి. నందు, లిరిసిస్ట్ : రాంబాబు గోసాల, ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్, సమర్పణ : కృష్ణ చైతన్య , నిర్మాత : స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ఆర్ఏ వెంకట్.