‘బెదురులంక 2012’ టీజర్ లాంఛ్‌లో హీరో కార్తికేయ

యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో సినిమా టీజర్ విడుదల చేశారు. అలాగే, మీడియా కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం మాట్లాడింది.

హీరో కార్తికేయ మాట్లాడుతూ ”ష్యూర్ షాట్ హిట్ అయ్యే స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో క్లాక్స్ కలిశాడు. అతను తెలుసు. అయితే, ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా రిఫర్ చేయడంతో అతని కథ విన్నాను. స్క్రిప్ట్ విన్నాక ఇటువంటి కథ కోసమే వెయిట్ చేస్తున్నానని అనిపించింది. ఎటువంటి లెక్కలు వేసుకోకుండా ఈ కథ చెప్పాలని, ఈ కథలో నేనూ పార్ట్ అవ్వాలని అనిపించింది. ప్రేక్షకులు అందరినీ థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందనే కారణంతో చేశా. ఈ సినిమా మాట్లాడుతుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రతి సన్నివేశంలో ప్రతి క్యారెక్టర్ హీరో. ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

కామెడీ, ఎమోషన్స్, ఫైట్స్, డ్యాన్స్… అన్నీ కథలో నుంచి వస్తాయి. చాలా బావుంటుంది. మనమంతా జీవితాన్ని ఒక కోణంలో చూస్తుంటే, క్లాక్స్ మరొక కోణంలో చూస్తాడు. ఇటువంటి సినిమా చేయడానికి నమ్మే నిర్మాత కావాలి. ఈ కథలో నేను చేయగలనని నమ్మి, సినిమాకు కావలసినట్టు చేసిన మా నిర్మాత బెన్నీ గారికి థాంక్స్. మంచి అభిరుచి ఉన్న ఇటువంటి నిర్మాతలు వస్తే డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడానికి మాకు అవకాశం వస్తుంది. ఈ దర్శకుడు, నిర్మాతతో పని చేయడం లక్కీ. హీరోయిన్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు పల్లెటూరిలో ఒదిగిపోయే అమ్మాయి కావాలి. ‘డీజే టిల్లు’లో నేహా చేసిన క్యారెక్టర్ మోడ్రన్ గా ఉంటుంది. అలా చేస్తుందేమో అనుకుంటే… చిత్ర పాత్రలో పర్ఫెక్ట్ గా చేసింది. తను వెర్సటైల్ యాక్టర్. మణిశర్మ గారు ‘చూడాలని ఉంది’ సినిమాకు ఇచ్చిన ‘రామ్మా చిలకమ్మా’ పాటతో నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఆయన పాటలకు ప్రతి ఫంక్షన్ కు డ్యాన్స్ చేస్తూ వచ్చా. ఈ సినిమాలో ఆయన పాటలకు డ్యాన్స్ చేయడం నాకొక అఛీవ్మెంట్. మా ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్. విజయ్ దేవరకొండ అన్న సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేశారు. ఆయనకు థాంక్స్. ముందు సినిమాల్లో జరిగిన తప్పులను రిపీట్ చేయకుండా చూసుకున్నాం. ఈ సినిమాను సపోర్ట్ చేసి నాకు ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి. థాంక్యూ” అని అన్నారు.

దర్శక రచయిత, నటుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ ”నాకు ‘బెదురులంక 2012’ కథ తెలుసు. నిర్మాత బెన్నీ నాకు మంచి ఫ్రెండ్. తను కథ చెప్పాడు. విన్న వెంటనే ‘ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా మంచి సినిమా అవుతుంది’ అని చెప్పా. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వర్కవుట్ అవుతున్నాయి. అవుతాయి కూడా! ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ హోల్డ్ చేసేలా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఉంటాయి. అటువంటి సినిమా ‘బెదురులంక 2012’. ఈ తరహా సినిమాలను హ్యాండిల్ చేయడానికి క్రాఫ్ట్ గురించి బాగా తెలిసిన, క్యారెక్టర్స్ మీద గ్రిప్ ఉన్న డైరెక్టర్ అయితే బావుంటుంది.

ఈ సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశా. క్లాక్స్ చాలా క్లియర్ గా తీశాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి కమర్షియల్ హీరో పడితే పెద్ద ఎస్సెట్ అవుతుంది. మన దగ్గర కమర్షియల్ పొటెన్షియల్ ఉన్న హీరోల్లో కార్తికేయ ఒకడు. మంచి హీరో. రెండు గంటలు పాటు మనం అన్నీ మర్చిపోయి అతడు పాడుతున్నా, ఆడుతున్నా, డైలాగ్ చెబుతున్నా, ఏడుస్తున్నా, నవ్వుతున్నా చుస్తున్నామంటే కమర్షియల్ పొటెన్షియల్ ఉన్న హీరో అని అనుకోవచ్చు. పూరి జగన్నాథ్ గారికి లక్కీ హ్యాండ్. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ‘డీజే టిల్లు’తో సూపర్ హిట్ అనుకుంది. కార్తికేయ, నేహా శెట్టిది టెర్రిఫిక్ కాంబినేషన్. ఈ సినిమాకు బేస్ బ్యాగ్రౌండ్ స్కోర్. మణిశర్మ గారిని ఎంపిక చేసుకున్నప్పుడు ఈ టీమ్ ఎంత ఫోకస్ గా సినిమా చేస్తున్నారో తెలిసింది. టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మెస్సేజ్ లు వస్తున్నాయి. సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.

నేహా శెట్టి మాట్లాడుతూ ”ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత బెన్నీ గారు, దర్శకుడు క్లాక్స్ గారికి థాంక్స్. నా లాస్ట్ సినిమా ‘డీజే టిల్లు’. అందులో నా క్యారెక్టర్ రాధికాను మీరు చాలా చాలా ప్రేమించారు. ‘బెదురులంక 2012’లో నా క్యారెక్టర్ చిత్రను కూడా అదే విధంగా ప్రేమిస్తారు. మా టీజర్ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండకి థాంక్స్” అని అన్నారు.

నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ”సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. ఈ రోజు విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

చిత్ర దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ”మా నిర్మాత బెన్నీ గారికి, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థకు ముందుగా థాంక్స్. నాకు తొలి అవకాశాన్ని ఇచ్చారు. కార్తికేయ ఎప్పుడూ నాకు మద్దతుగా ఉన్నారు. నిజాయతీగా చేసిన ప్రయత్నం ఇది. నటీనటులు అందరూ సపోర్ట్ చేశారు. పదేళ్ళ క్రితం నుంచి ఈ కథను చెబుదామని అనుకుంటున్నా. ఓటీటీలకు ఆదరణ పెరిగిన తర్వాత ప్రేక్షకులు కొత్త కంటెంట్ కూడా చూస్తారని నమ్మకం మాకు పెరిగింది. నేను అనుకున్న దాంట్లో 70 శాతం రీచ్ అయినా బావుంటుందని అనుకునేవాడిని. 90 శాతం రీచ్ అయ్యాను. నేను రెగ్యులర్ గా చూస్తున్నా. నవ్వుతున్నాను. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను. అకిరా కురుసోవా ‘సెవెన్ సమురాయ్’లో ఓ డైలాగ్ స్ఫూర్తితో ఈ కథ రాశా” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత దుర్గారావు, నటీమణులు రాజేశ్వరి, అనితా నాగ్, దివ్య నార్ని, నటులు కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

YouTube video player