మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘భ్రమయుగం’ షూటింగ్ పూర్తి

తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతోన్న ‘భ్రమయుగం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ ఎంతో సంతోషంగా పంచుకుంది. ‘భ్రమయుగం’ సినిమా ఆగస్టు 17, 2023 నుండి ఒట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి మొదలైన ప్రాంతాల్లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంది.

ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనుంది.

‘భ్రమయుగం’ భారీ అంచనాలు నెలకొన్న బహుభాషా చిత్రం. సెప్టెంబర్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లుక్‌తో కూడిన పోస్టర్ విడుదలైనప్పటి నుండి, అభిమానులు ఈ చిత్ర విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘కన్నూర్ స్క్వాడ్’తో సహా వరుస విజయాలతో దూసుకుపోతున్న మమ్ముట్టి, ‘భ్రమయుగం’తో ఆ విజయ పరంపరను కొనసాగిస్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ రచన-దర్శకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. హర్రర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి ప్రత్యేకంగా స్థాపించబడిన నిర్మాణ సంస్థ ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి.

చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ‘భ్రమయుగం’ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్‌గా జోతిష్ శంకర్, ఎడిటర్‌గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, మాటల రచయితగా టి.డి. రామకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. మేకప్ బాధ్యతలు రోనెక్స్ జేవియర్, కాస్ట్యూమ్స్ బాధ్యతలు మెల్వీ జె నిర్వహిస్తున్నారు.