దీపావళి కానుకగా అక్టోబర్ 31న ”లక్కీ భాస్కర్” చిత్రం విడుదల

వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతారామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

దుల్కర్ సల్మాన్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులు సైతం “లక్కీ భాస్కర్” విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన “శ్రీమతి గారు” గీతం, టైటిల్ ట్రాక్ తో పాటు, టీజర్‌ విశేషంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఇప్పుడు దీపావళి పండుగ కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు.

“లక్కీ భాస్కర్” కోసం ఇంతలా ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూనే.. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేయడానికి అదనపు సమయం పడుతుందని, అందుకే విడుదల తేదీ మారిందని నిర్మాణ సంస్థ వివరించింది. వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించడం కోసం, డబ్బింగ్ సహ అన్ని సాంకేతిక విభాగాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పని చేస్తున్నట్లు తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని, ప్రతి భాషలో మాతృ భాష అనుభూతిని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

చిత్ర విడుదలను వాయిదా వేయడం కష్టమైనప్పటికీ, ఈ నిర్ణయం సినిమాకు మేలు చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. “లక్కీ భాస్కర్” చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు బంగ్లాన్ ఈ చిత్రం కోసం 80ల నాటి ముంబైని పునర్నిర్మించారు. ఈ చిత్రంలో ఆయన అద్భుత పనికి అవార్డులు అందుతాయని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి కెమెరా పనితనం దర్శకుని ఊహకు ప్రాణం పోసింది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఒక సాధారణ వ్యక్తి యొక్క అసాధారణ కథగా తెరకెక్కిన ఈ “లక్కీ భాస్కర్” చిత్రం 2024, అక్టోబర్ 31వ తేదీన తెలుగు, మలయాళం, తమిళ మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్