‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’కి మెగాస్టార్‌ ప్రశంసలు!

విడుదలకు ముందే ’మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు దక్కాయి. విడుదలకు ముందే సినిమాను వీక్షించిన చిరు చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుని సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. అంతే కాదు.. సినిమాకు రివ్యూ కూడా ఇచ్చేశారు. అభిమానులతో కలిసి థియేటర్‌లో సినిమా చూడాలనే కోరిక కలిగిందని అన్నారు.

;’మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ఎం సినిమా చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్‌ ఎంటర్ టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిప్లెక్ట్‌ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్‌ పోలిశెట్టి, కొంచెం గ్యాప్‌ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌ గా వున్న మనందరి ‘దేవసేన’, అనుష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు.

ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ అవటంతో పాటు ఎమోషన్స్‌ ని కూడా అద్భుతంగా మిక్స్‌ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్‌ మహేష్‌ బాబుని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్‌ మూమెంట్స్‌ ఎంతగానో ఎంజాయ్‌ చేశాను. మరోసారి థియేటర్‌ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్‌ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ 100శాతం ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు’ అని పోస్ట్‌లో చిరు పేర్కొన్నారు. చిరంజీవి పోస్ట్‌ చూసిన ఫ్యాన్స్‌ సైతం ఆల్‌ ది బెస్ట్‌ అంటూ నవీన్‌ పోలిశెట్టికి అభినందనలు చెబుతున్నారు.

నవీన్‌ పోలిశెట్టి, అనుష్క శెట్టి కీలక పాత్రధారులుగా మోస్ట్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేశ్‌ బాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 7న థియేటర్లో సందడి చేయనుందీ చిత్రం.