‘బలగం’ ట్రైలర్ విడుదల

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యు’ స‌ర్టిఫికేట్ పొందిది. ఇప్పుడు మేక‌ర్స్ బ‌ల‌గం సినిమాను మార్చి 3న రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా సోమవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ చేతులు మీదుగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా ఊరి వాతావరణం, కల్మషం లేని మనస్తత్వాలను చూపించారు.

ఇక ఊరి మనషులకు ఉండే పంతాలు, పట్టింపులను చక్కగా చూపించారు. హీరో హీరోయిన్ల ప్రేమ కథ కూడా కొత్తగా కనిపిస్తోంది. ఊర్లోని ఓ ఇంట్లో అశుభం జరిగితే.. ఊరంతా ఎలా స్పందిస్తుంది.. బంధుగణం ఎలా ప్రవర్తిస్తుంది.. అంటూ ఈ ట్రైలర్‌లో ఎంతో చక్కగా చూపించారు. ‘మీరేమైనా మనుషులేనారా.. ఇజ్జత్ పోతాంది కదరా.. ఎవ్వని స్వార్థం వాడే చూసుకుంటాండ్రా’ అంటూ ట్రైలర్ చివర్లో చూపించిన డైలాగ్‌ కథ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది.

ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ బాగుంది. సినిమా యూనిట్‌కు కంగ్రాట్స్. తెలంగాణ నేపథ్యాన్ని ఎంతో సహజంగా చూపించారు’ అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్‌ను స్థాపించాం. బలగం సినిమా అందరినీ కదిలిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది’ అని అన్నారు.

వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రలు పోషించారు.

YouTube video player