కర్టెన్ రైజర్ వేడుకలో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ ట్రోఫీ లాంచ్

దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుక నిర్వహించనున్నారు. ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. శుక్రవారం ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీ వీ వీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి,గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ..“గతంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గామా అవార్డ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మధ్యలో మూడేళ్ల పాటు కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించలేకపోయారు. కానీ ఈసారి టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నారు. 2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి – బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందజేయనున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు” అని చెప్పారు.

దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ..“ఈ జ్యూరీలో సభ్యుడిగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి త్రిమూర్తులు గారు నిర్వహిస్తున్న ఈ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. చాలా జెన్యూన్ గా అవార్డు వేడుకను నిర్వహించబోతున్నాం” అని చెప్పారు.

నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ..“గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి త్రిమూర్తులు గారు ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

రఘు కుంచే మాట్లాడుతూ..“దేశం కానీ దేశంలో తెలుగువారు గర్వపడేలా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను” అని చెప్పారు.

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ..” వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక‌పై చాలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ ప్రముఖుల అందరిని ఈ వేడుకకు ఆహ్వానించాం.గామా స్థాపించినప్పటి నుండి.. గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తూ.. అవార్డు ఫంక్షన్‌ను ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు” అని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో డింపుల్ హయతి పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని, ఈ గామా అవార్డ్స్ లో భాగమవడం ఆనందంగా ఉందని డింపుల్ చెప్పారు.

ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలుగు సినిమా దర్శకుల వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ అన్నారు.

“ఆస్కార్ పురస్కారం అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ల‌కు ప్రత్యేకంగా ‘గామా గౌరవ్ సత్కార్’తో పాటు, ప్రఖ్యాత గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’ను గాయకులు మనోకి అందిస్తున్నామని గామా అవార్డ్స్ దర్శకులు ప్రసన్న పాలంకి తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు సుకుమార్, బాబీ, బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, సంగీత దర్శకులు, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్, ఎం ఎం శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్, గాయకులు మనో, ధనుంజయ్.. ఇంకా ఎందరో సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాయనీ గాయకులు, కమెడియన్లు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.