184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు..

తెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ & కల్చర్ తెలంగాణ ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ ఎస్ గోపాల్ రెడ్డి ( లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్), ఛోటా కె. నాయుడు, కె కె సెంథిల్ కుమార్, శరత్, కె రవీంద్రబాబు, సి రామ్ ప్రసాద్, హరి అనుమోలు, రసూల్ ఎల్లోర్ లను ఘనంగా సత్కరించారు. యువ సినిమాటోగ్రాఫర్స్ కార్తిక్ ఘట్టమనేని, ఉదయ్ గుర్రాలని సినిమాటిక్ విజనరీ అవార్డ్స్, సాయి శ్రీరామ్, దాశరధి శివేంద్ర, నగేష్ బ్యానల్, బాల్రెడ్డి, సినిమాటిక్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ తో సత్కరించారు. ఈ వేడుకలో దర్శకులు కోదండరామి రెడ్డి, వివి వినాయక్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి, సాయి రాజేష్, దామోదర్ ప్రసాద్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో ఎస్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమలో 55 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. 1968లో చెన్నై వీనస్ స్టూడియోలో అప్రంటీస్ గా చేరాను. అంచెలంచెలుగా సినిమాటోగ్రఫర్ అయ్యాను. ఇప్పటికి యాభై ఐదేళ్ళు అయ్యాయి. ఈ రోజు నా మిత్రులందరి ముందు ఈ సత్కారం తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ.. ఎస్ గోపాల్ రెడ్డి గారిని చూసి ఆయనలా మంచి కెమరామేన్ కావాలని స్ఫూర్తి పొందాను. మన తెలుగులోనే ది బెస్ట్ కెమరామెన్స్ వస్తున్నారు. సరైన అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారు. ఇండియన్ సినిమాని తెలుగు కెమరామెన్ రూల్ చేస్తారనే నమ్మకం వుంది. దీన్ని సవాల్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి’’ అన్నారు.

సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. కెమరామెన్స్ అందరినీ ఇలా ఒక్కచోట చూడటం ఆనందంగా వుంది. ‘ఐతే’ సినిమా చేస్తున్నప్పుడు నేను కూడా ఒక బెస్ట్ కెమరామేన్ అవ్వాలని కల కన్నాను. అక్కడి నుంచి ప్రయాణం మొదలైతే.. ఈ రోజు ఒకటికాదు.. రెండు కాదు.. మూడు వెయ్యి కోట్ల సినిమాలు చేశాను. చాలా ఆనందంగా వుంది. బహుశా ఆస్కార్ కమిటీలో వున్న ఇండియన్ టెక్నిషియన్ ని నేను అనుకుంటాను. ఇటివలే ఇన్విటేషన్ వచ్చింది. ఇది ఒక అచీవ్మెంట్ గా భావిస్తున్నా. తెలుగు సినిమా చేస్తే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనడానికి ఇది నిదర్శనం’’ అన్నారు

కోదండరామి రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడి ఊహకు వందరెట్లు బెటర్ గా చూపించే సినిమాటోగ్రాఫర్స్ నిజంగా గొప్పవాళ్ళు. ప్రతి దర్శకుడు మీకు రుణపడి ఉంటారు. ఎంతోమంది పెద్ద సినిమాటోగ్రాఫర్స్ తో పని చేయడం నా అదృష్టం’’ అన్నారు.

వివి వినాయక్ మాట్లాడుతూ.. ఈ వేడుక చూస్తుంటే చాలా ఆత్మీయంగా వుంది. చిన్నప్పుడు ఫోటోగ్రాఫర్ అవ్వాలని వుండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కెమెరా గురించి తెలిసింది. కొత్తగా వచ్చే కెమరామెన్స్ కి ఒక సలహా. దర్శకులు ఏం చెప్తే అది చేయడం మంచిదే. కానీ కొందరికి లైటింగ్ మీద అంత పట్టులేకపోవచ్చు. అలాంటప్పుడు దర్శకుడని కన్విన్స్ చేసి చేయాల్సిన బాధ్యత వుంది. ఇలాంటి విషయంలో చోటా కే నాయుడు దిట్ట(నవ్వుతూ) ఎవరినైనా మ్యాజిక్ చేస్తారు. ఆ మ్యాజిక్ అందరూ నేర్చుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ వేడుకు రావడం ఆనందంగా వుంది’’ అన్నారు.

కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సినిమాటోగ్రాఫర్స్ అందరికీ బర్త్ డే లాంటి వేడుక ఇది. నా ప్రయాణంలో విఎస్ఆర్ స్వామీ, విన్సెంట్ లాంటి గొప్ప సినిమాటోగ్రాఫర్స్ తో పని చేసే అవకాశం దొరికింది. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి, హరి, శరత్ రసూల్ ఇలా ఎంతోమందితో ట్రావెల్ వుంది. ఇలాంటి కార్యక్రమాలని యూనియన్స్ ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలాంటి వేడుకలు జరగడం చాలా అనందంగా వుంది. సినిమా విజువల్ మీడియం. కథని విజువల్ గా చూపించేది సినిమాటోగ్రాఫర్స్. కళతో కూడుకున్న బిజినెస్ సినిమా మాత్రమే’’ అన్నారు.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. సినిమాటోగ్రఫర్స్ సినిమాకి హార్ట్ అండ్ సోల్. సినిమా అనేది కళ. ఆ కళకు కళ్ళు ఇచ్చేది సినిమాటోగ్రఫర్స్. ఈ వేడుక ఇంత ఘనంగా జరగడం, అందరిని కలవడం చాలా ఆనందంగా వుంది. ఒక సినిమా విజయంలో సినిమాటోగ్రఫర్స్ కంట్రీబ్యుషన్ చాలా వుంటుంది. ఇలాంటి వేడుకలు సినిమాటోగ్రఫర్స్ కు మరింత స్ఫూర్తిని ఇస్తాయి’’ అన్నారు.