ఆమె ఓ మహిళ.. అందులోనూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆమె ఆ దేవాలయంలోకి అడుగు పెట్టారని ఏకంగా దేవాలయానికి, విగ్రహాలకు శుద్ది చేశారు గ్రామస్థులు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో మీరు కూడా చూడండి…
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హామీర్పూర్ జిల్లాలో జరిగింది. రాత్ నియోజకవర్గ ఎమ్మెల్యే మనీషా అనురాగి ముష్కర ఖుర్డ్ అనే గ్రామానికి పర్యటనకు వెళ్లారు. స్థానిక పాఠశాలలో పిల్లలలకు పుస్తకాలు పంచి అనంతరం గ్రామంలో ఉన్న ధూమ్ర రుషి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ధూమ్రరుషి మహా భారత కాలానికి చెందిన వారు. పూర్వ కాలం నుంచే ఈ ఆలయంలోకి మహిళల ప్రవేశం లేదు. ధూమ్రరుషి కళ్లేదుట మహిళలు ఉంటే అది ఊరికి అరిష్టమని గ్రామస్థులు నమ్ముతారు.
తాజాగా ఎమ్మెల్యే గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు ఆలయంలోకి వచ్చి దేవుడిని దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యే కావడంతో ఆమెకు ఎవ్వరూ అడ్డు చెప్పలేకపోయారు. ఆమె వెళ్లి పోయిన తర్వాత ఊరికి ఏమవుతుందనే భయం ఆ గ్రామస్థులకే పట్టుకుంది. గ్రామస్థులంతా సమావేశం అయ్యి గంగాజలంతో ఆలయాన్ని శుద్ది చేయాలని తీర్మానించుకున్నారు. గంగా జలంతో ఆలయాన్ని శుద్ది చేయడమే కాకుండా మహార్షి రూపాన్న పోలి ఉన్న విగ్రహాన్ని అలహాబాద్ సంగమ క్షేత్రంలో పవిత్ర స్నానం చేయించి తీసుకొచ్చారు. ఆలయ శుద్ది విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అనురాగి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని, మహిళలను అవమాన పరచడమేనని ఆమె గ్రామఃస్థులపై అసహనం వ్యక్తం చేశారు. కేరళ శబరిమల ఆలయానికి మహిళలకు ఆలయంలో ప్రవేశం ఉంటుందని చెప్పుతున్న సంధర్భంలో ఈ ఘటన జరగడంతో అంతా చర్చనీయాంశమైంది.
