తీవ్రవాది మసూద్ అజర్ ను అంతర్జాతీయటెర్రరిస్టుగా గుర్తించారనేది ఈ రోజు ప్రపంచ ప్రతికలన్నీ ప్రధానంగా ప్రచురించిన వార్త .
మసూద్ అజర్ కు నిన్నటి దాకా చైనా అండ వుండింది. అజర్ ను అంతర్జాతీయ తీవ్ర వాదిగా గుర్తించేందుకు అన్ని దేశాలు ఒప్పుకున్నా చైనా మాత్రమే తాత్సారం చేస్తూ వచ్చింది. పీతకష్టాలు పీతవి. చైనా కష్టాలు చైనావి. అజార్ లాంటి తీవ్రవాదిని గిల్లుకుంటే చైనాలో ముస్లింలు అధికంగా ఉండే రాష్ట్రాలలో ఏంచిక్కలొస్తాయోనని చైనా భయం. దానికితోడు భారత్ మీదే ఎక్కుపెట్టిన ఎకైన తీవ్రవాద సంస్థ నాయకుడు అతను. అందువల్ అజర్ తో పేచీ ఏముంది?
మొత్తానికి ఐక్యరాజ్యసమితి తీర్మానంలో కొద్దిగా మార్పులు చేయించి, అజర్ ను తీవ్రవాదిగా గుర్తించేందుకు చైనా అంగీకరించింది. చైనా కోరిక మీద తీర్మానంలో కాశ్మీర్, పుల్వామా వంటి పేర్లుతీసేశారు. అంటే తీర్మానం ఇండియా వత్తిడి మీద ఆమోదించారనే అనుమానం ఎవరికీ రాకూడదని చైనా భావిస్తూ ఉంది.మొత్తానికి పాకిస్తాన్ లో మతపెద్ద లాగా కూర్చుని కాశ్మీర్ లో హింసాకాండ ప్రేరేపిస్తున్న మసూద్ అజర్ మీద,ఐక్యరాజ్యసమితి తీర్మానంల్ ఏంరాసినా, చివరకు అంతర్జాతీయ తీవ్రవాది అని యుఎన్ ముద్ర పడింది.
ఇంతకీ మసూద్ అజర్ ఎవరు? అతని ప్రత్యేకత ఏమిటి?
అజర్ కి ఇతర తీవ్రవాదులకు చాలా తేడా ఉంది. ఇతగాడికి ఇస్లామ్ జిహాద్ కంటే కాశ్మీర్ విముక్తి ముఖ్యం. ఈ లక్ష్యంతో పనిచేస్తున్నందునే పాకిస్తాన్ లో అజర్ కు ప్రత్యేక హోదా లభించింది. చైనా కూడా అజర్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించేందుకు ఆచితూచి అడుగేయడానికి కారణం అజర్ హింసాకాండ కాశ్మీర్ బయట లేకపోవడమే.
తాను సొంతంగా తీవ్రవాదలు హింసాకాండకు బలవుతున్నా, తీవ్రవాదులు రెగ్యులర్ గా బాంబులు పేల్చి వందల మంది హతమారుస్తున్నా, పాకిస్తాన్ అజర్ జోలికి రాకపోవడానికి కారణం కూడ ఇదే. అజర్ హింసా కాండ కాశ్మీర్ కే పరిమితం కావడం.అతన్ని కాశ్మీర్ విముక్తి జిహాదీ లాగా చూడటం. అతని సంస్థలు పాకిస్తాన్ లో ఉన్నాయిగాని కార్యకలాపాలన్నీ కూడా భారత దేశంలోని కాశ్మీర్ లోనే.భారత్ సైన్యం మీద, సైనిక స్థావరాల మీదే దాడులన్నీ.దీనివల్లే భారత్ ఎంత వత్తిడి తెచ్చినా పాకిస్తాన్ అజర్ మీద చర్య తీసుకోకుండా , పాక్ లో అతని మీద కేసులేవీ లేవనే సాకు చూపుతూ ఉంది.
కాశ్మీర్ విముక్తి ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ కావడంతో పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ ఐకి అజర్ అంటే చాలా ఇష్టం. అతనికి అన్ని విధాల భద్రత, సహకారం అందిస్తున్నది. ఇపుడు అజర్ గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తింపు పొందినా పాక్ అతని మీద సీరియస్ గాచర్యలుతీసుకుంటుందా అనేది అనుమానమే. ఎందుకంటే కాశ్మీర్ విముక్తి చేయాలన్న ధ్యేయాన్ని పాకిస్తానీయులు టెర్రరిజం గా చూడరు.
అజర్ ఎక్కడివాడు
మసూద్ అజర్ మంచి వక్త. ఇస్లామిక్ పండితుడు. అందుకే తొలినుంచి అతను ముస్లిం యువకులను కాశ్మీర్ విముక్తివైపు చైతన్యవంతం చేసే క్యాంపెయిన్ ప్రతిభావంతంగా నిర్వహిస్తూ వస్తున్నాడు.
అతని కుటుంబ నేపథ్యం గురించి ఎక్కడా పెద్దగా సమాచారం లేదు. పాకిస్తాన్ పంబాజ్ ప్రాంతంలోని భావల్పూర్ ప్రాంతానికి చెందిన వాడని అందరికి తెలుసు.
భావల్ పూర్ లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ కుటుంబంలో పదకొండు మందిసంతానంలో మూడోవాడు గా 1968 జూలైలో జన్మించాడు. అతనికి చదవు పెద్ద గా అబ్బలేదు. రెగ్యులర్ చదవు ఎనిమిదో తరగతిలోనే డుమ్మాకొట్టాడు. అయితే, జామియా ఉలూమ్ ఇస్లామిక్ స్కూల్ లో చేరాడు.ఇస్లామిక్ చదువుకు ఆయనకు బాగా ఒంటపట్టింది. 1989లో అక్కడ అలిమ్ గా పట్టభద్రుడయ్యాడు. వెంటనే ఒక మదర్సాలో ఇస్లామిక్ టీచర్ గా నియమితుడయ్యాడు. ఇక్కడే అతను తీవ్రవాది అయ్యేందుకు బీజాలు పడ్దాయి. ఈ మదర్సా హర్కత్ ఉల్ అన్సర్ అనే సంస్థ కార్యకలాపాలక వత్తాసుపలుకుతూ ఉండింది. దీని వల్లే అజర్ కు ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా సాగుతున్న జిహాద్ తో పరిచయమయింది. అక్కడే జిహాది శిక్షణ తీసుకున్నాడు.
సోవియట్ తో జరుగుతున్న ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇందులో తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత ఈ యుద్ధంనుంచి విరమించుకున్నాడు. ఎందుకో అంతర్జాతీయ కార్యకలపాలు, యుద్ధాలు ఆయన నచ్చలేదు. అతని దృష్టి కాశ్మీర్ వైపు మళ్లింది. జమ్ముకాశ్మీర్ భూభాగాన్ని భారత్ అక్రమించుకుందని, అక్కడి ముస్లింలు భారత పాలనలో నలిగిపోతున్నారని, కనీసం వారు మసీదుకు వెళ్లి ప్రార్థనలు కూడా చేయలేకపోతున్నారని ఆయన నమ్మారు.
ఇదే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కాశ్మీర్ విముక్తి పేరుతో ఆయన భారత్ ను ప్రధాన శత్రువును చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి, అక్కడి గూఢచారి సంస్థకు అజర్ కు ఇక్కడే అనుబంధం కలిసింది. ఆయనకు ప్రత్యేక హోదా లభించేందుకు కారణమయింది. ఈ దశలో హర్కత్ సంస్థ యువకులను చైతన్యం చేసే కొత్త బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ఇదంతా కూడా కాశ్మీర్ విముక్తి ప్రచారానికి వాడుకున్నారు. ఆయన జిహాద్ మొత్తొం కాశ్మీర్ కు పరిమితం చేసుకున్నారు.
హర్కత్ మోటివేషన్ డిపార్ట్ మెంట్ కు అధిపతి కూడా అయ్యారు. అంతేకాదు,ఈ ప్రచారసాధనాలైన సదేముజాహిదీన్ అనే ఉర్దూ మ్యాగజైన్ కు, సాతే కాశ్మీర్ అనే అరబిక్ పత్రికలకు ఎడిటర్ ను కూడా చేసింది.
ఇక్కడి నుంచి అజర్ ఈ సంస్థలో పెద్దవాడవడం మొదలయింది. కొద్ది రోజుల తర్వాత హర్కత్ ఉల్ అన్సర్ సంస్థ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు.ఈ హోదాలో పలుదేశాలు తిరిగి తన సంస్థకు నిధులు సేకరించేందుకు , యువకులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే అజర్ కరుడు గట్టిన తీవ్రవాదులను తన సంస్థలో చేర్చుకున్నాడు. దీనికోసం అల్ ఖేదా, హర్కత్ ఉల్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద సంస్థల సహకారం కూడా తీసుకున్నాడు.
1993లో అజర్ హర్కత్ ఉల్ అన్సార్ కు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత అతని ఏకైక లక్ష్యం ఇండియాతో తలపడటమే అయింది. కాశ్మీర్ లో భారత్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించడం అతని కార్యక్రమం అయింది. జమ్ముకాశ్మీర్ లోని దేశీయ కాశ్మీర్ సంస్థలను ఆయన ద్వేషిస్తారు. ఫలితంగా కాశ్మీర్ విముక్తి తన భుజాల మీద వేసుకున్నాడు. తన కాశ్మీర్ విముక్తి నాయకుడుని గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతటి హింసకైనా పాల్పడేవాడు. దీనితకోసమే ఇండియాలో ప్రవేశించాడు.
1994లో అజర్ ఒక బోగస్ పాస్ పోర్టుతో బంగ్లాదేశ్ గుండా ఇండియాలో ప్రవేశించాడు. అయితే, కాశ్మీర్ లో అతని ఉనికి బయటపడింది. భద్రతా దళాలు ఫిబ్రవరి 11, 1994న అతన్ని అరెస్టు చేశాయి. కాశ్మీర్ ను విముక్తి చేసేందుకు 12 దేశాలనుంచి ఇస్లాం సైనికులుస్తున్నారు. మీతుపాకులకు మా రాకెట్లు సమాధానం చెబుతాయి,’ అని అతడు ప్రకటించాడు. ఏదో విధంగా తాను విడుదలవుతానని ప్రకటిస్తూనే ఉన్నాడు.
అరెస్టయినప్పటి నుంచి అతన్ని విడిపించేందుకు తీవ్రవాదలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తం నాలుగు ప్రయత్నాలు జరిగాయి. నాలుగో ప్రయత్నం విజయవంతమయిది.
1995లో జమ్ము కాశ్మీర్ లో ఆరుగురు విదేశీ పర్యాటకులను అల్ ఫరాన్ తీవ్రవాదులు అరెస్టు చేశారు. మసూద్ అజర్ తో పాటు మరొక ఇద్దరు జిహాదీ ఖైదీలను విడుదల చేస్తే పర్యాటకులను విడుదల చేస్తామన్నారు. ఈ అరుగురిలో ఒకరు తప్పించుకుని పోయారు. మరొకరికి శిరచ్ఛదం చేశారు. మిగతావారేమయ్యారో ఇప్పటికీ తెలియదు. అయితే, అప్పటికి అజర్ను విడిపించుకోవడంలో ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు.
తర్వాత మరొక రెండు ప్రయత్నాలు జరిగాయి. వాటిని భారత్ లెక్క చేయలేదు.
నాలుగో ప్రయత్నం పకడ్బందీగా 1999లో జరిగింది. ఈ సారి ఖట్మాండు నుంచి 180 మంది ప్రయాణికులతో న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి అమృత్ సర్ మీదుగా కాందహార్ కు తీసుకెళ్లారు. కాందహర్ అపుడు తాలిబన్ల అదుపులో ఉంది. విమానంలో ఉన్న ప్రయాణికులను విడుదల చేయాలంటే భారత్ లో ఉన్నఅజర్ తో పాటు మరొక ఇద్దరిని అంటే మొత్తం ముగ్గురు ఖైదీలను విడులచేయాలని హైజాకర్లు డిమాండ్ పెట్టారు. ముస్తాఖ్ అహ్ద్ జర్గార్, ఉమర్ సయీద్ షేక్ అనే వాళ్లు మిగతా ఇద్దరు.
హైజాకర్లకు నాయకత్వం వహిస్తున్నది ఎవరో కాదు అజర్ తమ్ముడు ఇబ్రహీం అథర్. అపుడు అజర్ కాశ్మీర్ లోని కోట్ భల్వాల్ జైలులో ఉన్నాడు.విమర్శలు ఎదురయినా 180 మంది ప్రయాణికుల భద్రత కోసం అప్పటి ఎన్ డిఎ ప్రభుత్వం హైజాకర్ల డిమాండ్ కు అంగీకరించింది. అజర్ ను విడుదలచేసింది. కాందహార్ లో అజర్ ను అప్పగించి, ప్రయాణికులను విడిపించుకున్నాక, హైజాకర్లు పాకిస్తాన్ కు పారిపోయారు. హైజాకర్ల మీద పాకిస్తాన్ ఎలాంటి కేసులు లేవు కాబట్టి వాళ్లను దేశంలోకి అనుమతిస్తున్నామని అధికారులు ప్రకటించారు.
అజర్ విడుదలయిన తర్వాత దాదాపు పదివేల మందిదాకా సాయుధ అనుచరులు హాజరయిన ఒక సభలో ప్రసంగిస్తూ భారత్ నుంచి కాశ్మీర్ ను విముక్తి చేసే దాకా ముస్లింలెవరూ నిద్రపోరాదని పిలుపునిచ్చాడు. ఆ తర్వాత అమెరికా హర్కత్ ఉల్ అన్సర్ ను నిషేధించింది. దీనితో అజర్ అవతారం మార్చుకోవలసి వచ్చింది. హర్కత్ ఉల్ అన్సర్ రాత్రికి రాత్రి హర్కత్ ఉల్ ముజాహిదీన్ గా మారిపోయింది.
తర్వాత 2000 లో అజర్ జైస్ ఇ మొహమ్మద్ (జెఇఎం)అనే సంస్థను ఏర్పాటుచేశాడు. ఇది ఆయన కుటుంబ సంస్థ. దీనిలో నాయకత్వ స్థానంలో ఉన్నవారంతా అజర్ కుటుంబ సభ్యులే. కాశ్మీర్ ను విముక్తి చేయడం ఈ సంస్థ ఏకైక లక్ష్యం. జైస్ ఇ మొహమ్మద్ అంటే, మొహమ్మద్ సైనికులు అని అర్థం. పైకి ఈ సంస్థను పాకిస్తాన్ కూడా నిషేధించింది. ఒకనాటి అధ్యక్షుడు పర్వేజ్ ముషరాఫ్ మీద హత్యాయత్నం చేశారనే సైన్యం ఒకసారి జెయిష్ సంస్థ మీద విరుచుకుపడింది. అయితే, పాకిస్తాన్ నుంచి సురక్షితంగా తన భారత వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తూనే ఉంది. దీనికి పాకిస్తాన్ సహకరిస్తూనే ఉంది.
ఈ సహకారంతోనే అజర్ చాలా సార్లు భారత లోని అనేక ముఖ్యమయిన ప్రదేశాలలో దాడులు జరిపించాడు. 2001లో జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ మీద దాడి, 2001లో భారత పార్లమెంటు మీద దాడి, 2016లో పఠాన్ కోట్, నగ్రోట్, యూరిల లో దాడి, 2019లో పుల్వామా దాడులు ఇందులో ప్రధాన మయినవి.
