మహాలయ పక్షాల్లో… కాకి గోల

(మల్యాల పళ్లంరాజు)

 

కోడి కూయగానే నిద్రలేచేవారు కరవయ్యారు. ఉదయాన్నే పెరట్లో కాకి కావు..కావు మనగానే.. ఛీ,,, కాకిగోల అనుకుంటు లేచేవారం ఒకప్పుడు.. ఇప్పుడు నరేంద్ర మోడీ .. స్వచ్ఛ్ భారత్ నినాదం ఇస్తున్నాడు కానీ, ప్రపంచంలో కాకి ఆవిర్భావం నుంచి స్వచ్ఛ్ ఉద్యమం నడుస్తోంది. పురుగుల్ని, వానపావుల్ని, చచ్చిన ఎలుకల్ని శుభ్రంగా ఆరగించి కాకులే స్వచ్ఛ్ కార్యక్రమం అమలు చేసేవి.  ఈ మధ్య కాకులు అంతరించి పోతున్నాయి.. అందుకు కారణం.. ఒకటా రెండా… పట్టణీ కరణ, చెట్లు లేకపోవడం, అపార్ట్ మెంట్ సంస్కృతి, గ్రామాల్లో అయితే ఎరువులు బెడద.. దీంతో కాకులు అంతరించి పోతున్నాయి.  (అన్నట్లు కాకుల గుంపు ని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా? Murder of Crows.)

 

నిజానికి కాకిని  జాతీయ పక్షిగా ప్రకటించాల్సినంత చరిత్ర ఉంది.  రామాయణంలో నెమలి ప్రసక్తి ఉన్నా లేకున్నా.. కాకి పురాణం మాత్రం చోటు చేసుకుంది. సీతాదేవిని వేధించిన కారణం గానే శ్రీరామచంద్రుడు గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి కాకి కన్ను పొడిచేశాడని.. అప్పటి నుంచి కాకి ఏకాక్షి అయిందనే ఓ కథనం ఉంది.

 ఉదయాన్నే వాకిట్లో కాకి కావు కావు మంటే.. ఎవరో బంధువులు కట్టకట్టుకు వస్తున్నారనే సంకేతం మన జనాల్లో ఉంది. కాకి మన జాతీయాల్లో కూడా చోటు చేసుకుంది. అందమైన అమ్మాయికి అంత సుందరాంగుడు కాని వ్యక్తి భర్తగా దొరికితే  కాకి ముక్కుకు దొండపండు అనే సామెత గుర్తుచేసుకుంటాం. కాళ్లకూరి నారాయణ రావుగారి వరవిక్రయంలో సింగరాజు లింగరాజు గారు.. ఖరనామ సంవత్సరంలో మా వంట అంతా కాకిగూళ్లతోనే నడిచింది అంటారు. అలా కాకి గూళ్లు పడగొట్టి వంట చేసుకునే పొదుపరులకు ఆంధ్రదేశంలో కరువు లేదని కాళ్లకూరి వారి ఆలోచన.ఇప్పుడు కాకులూ అంతరించి పోతున్నాయి. కాకులు గూడు కట్టుకునే చెట్లు అంతరించి పోతున్నాయి.  దీంతో కాకి గూళ్లు కన్పించడం కూడా కరవైంది.

 

  ఇతర మతాల కన్నా కాకులు అంతరించడం వల్ల హిందూమతానికి  పెద్ద ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని.. వేద పండితులు సెలవిస్తున్నారు.  హిందువుల అంత్య క్రియల్లో శ్రార్థ కర్మ అతి ముఖ్యమైనది. వాయసపిండాన్ని కాకి ఆరగిస్తేనే.. పితృ దేవతలకు ఆ ఫలం అందుతుందని నమ్మకం. కాకులు కాకిపిండం( వాయసపిండం) ఆరగిస్తే తప్ప శ్రార్థ కర్మ పూర్తయినట్లు కాదు. ఇప్పుడు కాకులు అంతరించిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే పరిణామం అంటున్నారు పండితులు.

 

  హిందూ ధర్మంలో భాద్రపద మాసంలోవచ్చే పితృపక్షాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొన్ని కులాల వారు తమ పెద్దలకు వార్షిక ఆబ్దీకం లాంటివి పెట్టినా పెట్టక పోయినా.. పితృపక్షాల్లో  ఆ కార్యక్రమం చేయించడం ఆనవాయితీ. చాలా వేగంగా కాకులు అంతరించి పోవడంతో సమస్య పెరిగి పోతోంది.

 గత  రెండు దశాబ్దాలుగా  కాకుల జనాభా తీవ్రంగా క్షీణించి పోతోంది. పెద్ద నగరాల్లోనూ,  పట్టణాల్లోనూ, కాకులు కన్పించడమే లేదు. కాకులు పూర్తిగా అంతరించిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు అంటున్నారు. డాక్టర్ బి. ఎం. అరోరా. ఆయన ఇండియన్ జూల, వన్యప్రాణుల సంఘం ప్రెసిడెంట్ గారు. ఒకప్పుడు పావురాలు అంతరించిపోతున్న సూచనలు రాగానే, ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు సర్వేలు, అధ్యయనాలు చేసి పరిస్థితి పై  నివేదికలు ఇస్తే, పత్రికల్లో ,మీడియాలో ప్రచారం అయితే, జనం స్వచ్ఛందంగా స్పందించి పావురాలను పెంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఇప్పుడు కాకులు కరవై పోతున్న నేపథ్యంలో అలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

  గ్రామాల సమీపంలో అడవులు అంతరించిపోవడం, పట్టణాలు నగరాల్లో చెట్లు కరవై పోవడంతో మనుషులకూ కాకులకూ మధ్య అంతరం పెరిగినట్లు కన్పిస్తోంది. కాకులకు కాసిన్ని మెతుకులు వేసేవారే కరవయ్యారు. పెద్ద ఎత్తున పట్టణీకరణ పెరిగి పోవడం ఈ అనర్ధానికి మూలం.  ఒకప్పుడు పంట పొలాల్లో.. పంట గింజలను, చచ్చిన ఎలుకలు, వాన పాములు, చిన్నచిన్న క్రిమి కీటకాలను తిని కాకులు బతికేసేవి.. ఎరువులగోల ఎక్కువై, ఆ క్రిమి కీటకాలు, ఎరువులు క్రిమిసంహారక మందు సీసాలను రైతులు నిర్లక్ష్యంగా పడవేయడం వల్ల కాకులు వాటిపై వాలి, వాటిని ఆరగించడం వల్ల చనిపోతున్న దాఖలాలు ఉన్నాయి. కాకి ముక్కు మనిషికి ఉన్నంత పొడుగు ఉన్నా.. వాసన గ్రహించే శక్తి లేకపోవడం ఇందుకు కారణం.  అలాగే జనం ప్లాస్టిక్, పోలిథిన్ బ్యాగ్ లలో ఆహారాన్ని తెచ్చి పడేయడంతో అవి తిన్న కాకులు ఆరగించుకోలేక చనిపోతున్నాయి. ఏమైనా జనంలో చైతన్యం రావాలి. కాకులను మనిషి పెంచుకునే సంస్కృతి రావాలి. అరుదైన పక్షులలో ఒకటైన కాకుల్ని పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాలి. (Photo Pinterest)

 

(మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్)