ఇద్దరు పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ కేరళలోని తిరువనంతపురం సిబిఐ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. పోలీసుల కస్టడీలో ఉన్న 26 ఏళ్ళ యువకుడు మరణించిన కేసులో ఇద్దరు పోలీసులకు మరణ శిక్షతోపాటు పాటు, 2 లక్షల జరిమానా విధించింది కోర్టు. పోలీసులు టార్చర్ భరించలేకే యువకుడు మరణించి ఉంటాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ కే.జితకుమార్, సివిల్ పోలీస్ ఆఫీసర్ శ్రీకుమార్ లను ఎ1, ఎ2 నిందితులుగా చేర్చి దర్యాప్తు జరపగా…దోషులని తేల్చింది కోర్టు.
సాక్ష్యాలు నాశనం చేయటం, కుట్ర నేరాల కింద మరో ముగ్గురు నిందితులు టీకే హరిదాసు, ఈకె సాబు, అజిత్ కుమార్ లకు మూడేళ్లపాటు కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. కేవీ సోమన్ అనే మరో నిందితుడు విచారణ జరుగుతున్న సమయంలోనే మరణించాడు. వీపీ మోహన్ అనే నిందితుడు నిర్దోషిగా పరిగణించిన కోర్టు అతనిని గతంలోనే విడుదల చేసింది.
దొంగతనం కేసులో 2005 లో ఉదయ్ కుమార్ ను పోలీసుల కస్టడీకి తరలించారు. పోలీసుల టార్చర్ తో అతను స్టేషన్లోనే ప్రాణాలు విడిచాడు. ఉదయ్ కుమార్ ను కస్టడీలోకి తీసుకున్నందున ఈ హత్యకు బాధ్యులు జిత్ కుమార్, శ్రీకుమార్ లు ఇద్దరూ అని కోర్టు పరిగణించింది. ఉదయ్ కుమార్ కస్టడీలోనే చనిపోవటంతో అప్పట్లో ఇది కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారింది. రాష్ట్రమంతటా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. మృతుడి తల్లి ప్రభావతి తన కొడుకు మృతిపై న్యాయం జరపాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించడంతో…ఈ కేసును సిబిఐ కోర్టుకు అప్పగించింది హై కోర్ట్.
ఈ ఘటన చాలా కిరాతకమైనదని, మరణ శిక్ష పడిన ముద్దాయిలిద్దరూ హత్యకు పాల్పడినట్లేనని న్యాయమూర్తి జె.నాజర్ వ్యాఖ్యానించారు. మరణ శిక్ష సబబే అని అన్నారు. ఇటువంటి చర్యలు మొత్తం పోలీసు వ్యవస్థపైనే ప్రజలలో వ్యతిరేక ప్రభావం తెస్తాయని ఆయన వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే సమాజంలో శాంతి భద్రతలు కరువవుతాయన్నారు. అయితే సర్వీసులో ఉన్న అధికారులకు మరణ శిక్ష పడటం కేరళలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు.
