Vijay Tweet: తమిళనాట రికార్డు స్థాయి ఓటింగ్.. ‘భ్రమలు బద్దలయ్యాయి!’: విజయ్ సంచలన ట్వీట్

Vijay Tweet: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 85 శాతం ఓటింగ్ నమోదు కావడంపై తమిళ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ స్పందించారు. ఎన్నడూ లేని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు.

సామాన్యుడి దెబ్బకు పాత లెక్కలు గల్లంతు! 
రాజకీయాలు అంటే కేవలం అనుభవం ఉన్నవారికి, పదవులు అనుభవించే వారికి మాత్రమే పరిమితం అనుకునే వారి అహంకారాన్ని సామాన్య ప్రజలు ఓటుతో అణచివేశారని విజయ్ పేర్కొన్నారు.

“రాజకీయాలను నిర్దిష్ట సరిహద్దుల్లో బంధించి, నియంత్రించిన వారి భ్రమపూరిత లెక్కలు సామాన్య ప్రజల చేత బద్దలయ్యాయి, చితకబాదబడ్డాయి.” – విజయ్

యువత, మహిళల అద్భుత స్పందన: ఇప్పటివరకు రాజకీయాల పట్ల ఆసక్తి చూపరని భావించిన యువత, మహిళలు ఈసారి చైతన్యంతో ఓటు వేశారని విజయ్ తెలిపారు. ముఖ్యంగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కేవలం ఓటు వేయడం కోసమే స్వస్థలాలకు వచ్చిన వారి ప్రజాస్వామ్య స్పూర్తికి ఆయన సెల్యూట్ చేశారు. 85 శాతం ఓటింగ్ నమోదు కావడం తమిళనాడు ఎన్నికల రాజకీయ చరిత్రలోనే ఒక శిఖర చారిత్రక ఘట్టమని అభివర్ణించారు.

కుటుంబాలకు కృతజ్ఞతలు.. కార్యకర్తలకు అభినందనలు: తమిళనాడు ప్రజలను తన కుటుంబ సభ్యులుగా సంబోధించిన విజయ్.. అమ్మమ్మలు, తల్లులు, సోదరీమణులు, తండ్రులు, సోదరులకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీకు రాజకీయాలు ఏం తెలుసు? మీరు ఎలా నిలబడగలరు?” అని ఎగతాళి చేసిన వారికి మీ చేతలతోనే సమాధానం ఇచ్చారని ప్రశంసించారు.

తమిళనాడులో ఈసారి నమోదైన భారీ ఓటింగ్ ఎవరికి లాభిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ పార్టీ టీవీకే ఏ మేరకు ఓట్లను చీల్చింది? ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నట్లుగా, ఇది కేవలం “ఆరంభం మాత్రమేనా” అన్నది ఫలితాల రోజు తేలనుంది.

Raghav Chadha Resign from Aam Aadmi Party, join BJP | Telugu Rajyam