ఎంజివికె భాను అనే పేరు ఎపుడయిన విన్నారా? గుర్తు తెచ్చుకోండి, ఆయన అస్సాం క్యాడర్ ఐఎ ఎస్ ఆఫీసర్ (1985 బ్యాచ్). ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక నాటి ఐపిఎస్ ఆఫీసర్, ఒకనాటి కేంద్ర మంత్రి రంగయ్యనాయుడికి అల్లుడు. ఈ విషయాల వల్ల కాదు, ఆయన గుర్తుండేది. ఉమ్మది ఆంధ్రప్రదేశ్ కు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన సెక్రటెరీగా పనిచేశారు. అపుడు ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయన పేరెంట్ క్యాడర్ కు వెళ్లిపోయారు. మళ్లీ ఆయన పేరు వినిపించలేదు. ఆయన కూడా ఆంధ్రలో కనిపించలేదు. ఇపుడాయన అస్సాంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
సాధారణంగా నార్త్ ఈస్టులో ఉండే తెలుగు వాళ్ళు చాన్స్ దొరికితే వెనక్కి తెలుగు రాష్ట్రాలలో సెటిలవుతూ ఉంటారు. అయితే, భాను మాత్రమే అక్కడే రిటైరయి అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అస్సాంలో అసలే పరాయివాళ్ల (ఫారినర్స్ ) వ్యతిరేక సెంటిమెంట్ బలంగా ఉంటుంది. 1985 నుంచి దాదాపు 33 సంవత్సరాలు అస్సాం క్యాడర్ ఐఎఎస్ ఆఫీసర్ గా ఉన్న భానుకు అస్సాంలో ఈ సెంటిమెంట్ ఎంత బలంగా ఉంటుందో బాగా తెలుసు.అయినా సరే ఆయన తూర్పు అస్సాంలోని తేజ్ పూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. దీనికి చాలా ధైర్యం కావాలి. అస్సాం అడిషనల్ చీఫ్ సెక్రెటరీగా రిటైరయ్యాక ఏడు నెలల తర్వాత ఆయన గతనెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తేజ్ పూర్ భాను నెగ్గేందుకు చాలా కారణాలున్నాయి. ఇక్కడ తెలుగు వాళ్లు కూడా బాగా ఎక్కువ. ఇక్కడి టీ తోటల్లో దాదాపు 70 నుంచి నుంచి 80 వేల దాకా తెలుగు వాళ్లు ఉన్నారని చెబుతారు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కి ఆయన బాాగా సన్నిహితుడు. సర్వీసులో ఉన్నపుడు చాలా పలుకుడి ఉన్న అధికారిగా పేరుంది. దీనితో ఆయన తరచూ వార్తల్లో ఉండేవాడు. రిటైరయ్యాక ఆయన తెజ్ పూరు ఇల్లుకట్టుకుని అక్కడే నివాసముంటున్నారు.
‘రిటైరయ్యాక ఆంధ్రప్రదేశ్ కు పోయి హాయిగా కాలం వెల్లబుచ్చుతూ ఉండవచ్చు. అయినా సరే, ఇక్కడే ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే, నాకు అస్సాం అన్నా, ఇక్కడి ప్రజలన్నా చాలా అభిమానం,’ కాంగ్రెస్ లో చేరాక ఆయన అచ్చం రాజకీయ నాయకుడిలాగే మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా నవాబు పాలెం భాను సొంతవూరు.
తేజ్ పూర్ లో ఆయన బిజెపి రాష్ట్ర మంత్రి పల్లబ్ లోచన్ దాస్ తో ముఖాముఖి తలపడుతున్నారు. దాస్ టీ కార్మికుల తెగకు చెందిన వాడు. లోకల్ అనేది ఆయన బలం. దానికితోడు ప్రభుత్వం అండదండ ఉంటుంది. 2009 దాకా ఈ నియోజకర్గం కాంగ్రెస్ కంచుకోట. ఈ ప్రాంతంలో దాదాపు 15 శాతం మంది ఓటర్లు టీ తోటల్లో పని చేసే కార్మికులే. ప్లస్ ఇక్కడి నాన్ లోకల్స్ భాను ధైర్యం.
అపుడే బిజెపి ఆయనను నాన్ లోకల్ గా అంటే బయటివాడిగా ముద్ర వేసి ప్రచారం మొదలుపెట్టింది. లోకల్ నాన్ లోకల్ సెంటిమెంట్ తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నంచేస్తున్నది. ‘పల్లబ్ మా లోని మనిషి. భాను ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ దిగుమతి చేసుకున్న చేప. ఆయనిక్కడ గెలవడు,’ అని జోసెష్ లక్డా అనే బిజెపి నేత చెప్తున్నాడు.
ఒక వైపు నాన్ లోక్ ల్ ట్యాగ్ తో భాను ను ఓడించేందుకు బిజెపి ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉంది. అయితే, దీనికి భాను కూడా మాంచి సమాధానం పట్టారు. ఆధునిక అస్సాం సంస్కృతి పిత అని పేరున్న జ్యోతి ప్రసాద్ అగర్వాలా ఎవరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.రాజస్తాన్ లోని మార్వాడీ ప్రాంతంనుంచి అస్సాం కు వచ్చి తేజ్ పూర్ సెటిలయినా ఆయన అస్సాం అభివృద్ధికి కృషి చేయలేదా, మరి ఆయనను నాన్ లోక్ ల్ అని బ్రాండ్ వేస్తారా అని భాను వాదిస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు (పైన).
అయితే, ఒక్కటి మాత్రం కరెక్ట్. తేజ్ పూర్ ప్రజలకు భాను బాగా తెలుసు. ఇక్కడ 1996లో ఆయన కలెక్టర్ గా ఉన్నపుడు చేసినపనులకు మంచి పేరొచ్చింది. అంతేకాదు, తర్వాత 2011-2013 మధ్య టీ బోర్డు ఛెయిర్మన్ గా ఉన్నపుడు ఆయన టీ తోట కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలకు కూడా ప్రశంసలందాయి. అదే విధంగా అడిషనల్ ఛీఫ్ సెక్రెటరీగా పంచాయతీ రాజ్ శాఖను పర్యవేక్షిస్తున్నపుడు చేసినపనులు కూడా ఆయన పేరు ను నిలబెట్టాయి. నాన్ లోకల్ మరక ను పొగొట్టేందుకు ఇవిచాలని కాంగ్రెస్ వాళ్లు వాదిస్తున్నారు.
నాన్ లోకల్ బ్రాండ్ ఒక విధంగా భానుకు ఉపయోగపడుతూ ఉంది కూడా. ఎందుకంటే, తేజ్ పూర్ లో నేపాలీ, గూర్ఖా ప్రజలు దాదాపు 35 శాతం ఉన్నారు. వీళ్లంతా కూడా నాన్ లోకల్ బ్రాండ్ బాధితులే.
