తెలుగోడి ‘దేశీ పిజ్జా’ సూపర్ హిట్టయింది…

(సుమబాల)

ఫాస్ట్ ఫుడ్ దేశీ స్టైల్ అదే దేశీ పిజ్జా…స్పైసీ ప్రియుల కోసం…వెస్ట్రన్ ఫుడ్ లోనూ ఇండియన్ టచ్ కోరుకునేవారికోసం…కాస్త కారంగా, మరింత టేస్టీగా నేటివ్ టచ్ తో అందుబాటులోకి వచ్చిందే దేశీ ఫుడ్.

పిజ్జాను ఇష్టపడని అర్బన్ యూత్ ఉండరు. అందుకే సిటీలో ఎక్కడ చూసినా డోమినోస్, పిజ్జాహట్ ల అవుట్ లెట్ లు విరివిగా కనిపిస్తాయి. ఆర్డర్ చేస్తే అరగంటలో హాట్ హాట్ పిజ్జా మీ ఇంటికే వస్తుంది. ఇవి తమ వినియోగదారుల కోసం పిజ్జా మేకర్స్ అందిస్తున్న సేవలు. అయితే దీంట్లో చిన్న లోటు ఎప్పుడూ ఫీలవుతుంటాం. అదే మనదైన స్పైసీ ఉండకపోవడం. దీనికోసం పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ చల్లుకుని తృప్తి పడతారు.

ఈ అసంతృప్తికి చెక్ పెడుతుంది మణికొండ ఓయూ కాలనీలో ఉన్న దేశీపిజ్జా.  ఇక్కడికి వెడితే పూర్తిగా ఇండియనైజ్ అయిన స్పైసీ పిజ్జాలను తినచ్చు. ఎనిమిది రకాల మసాలాలతో తయారైన 26 రకాల దేశీపిజ్జాలు మీ టేస్ట్ బడ్స్ ని మెప్పిస్తాయి.

ఎన్నో వెరైటీలు

ఈ రుచి మనకు నచ్చడానికి కారణం మన సంప్రదాయ మసాలాలే. మిరియాలు, లవంగాలు, గసగసాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు లాంటి 16 రకాల వంటింటి మసాలా దినుసులతో ఎనిమిదిరకాల మసాలాలు స్వయంగా తామే తయారు చేస్తామని దేశీపిజ్జా ఓనర్ ముఖేష్ చెప్పాడు.

ఈ మసాలాలా రుచితో పాటు పిజ్జామీద టాపింగ్ కూడా ఎక్కువుండడం వల్ల కస్టమర్లు బాగా ఇష్టపడతారని అంటాడాయన.  26 రకాల పిజ్జాలు తయారు చేస్తున్నా వీటిలో  హాట్ అండ్ స్పైసీ, మసాలా, డీలక్స్ వెజ్, దేశీమసాలా, నాన్ వెజ్ లో మసాలా ముర్గ్, లెమన్ రోస్టెడ్ ఎక్కువగా డిమాండ్ ఉన్న పిజ్జాలనీ, ఇందులో దేశీ మసాలా పిజ్జా మా  సిగ్నేచర్ పిజ్జా అని చెప్పుకొచ్చాడు ముఖేష్.

కిడ్స్ స్పెషల్

ఏ పిజ్జా సెంటర్ లోనూ కనిపించని మరో ప్రత్యేకత దేశీపిజ్జాలో కనిపిస్తుంది అదే కిడ్స్ స్పెషల్ పిజ్జాలు. వీటిలొ జస్ట్ చీజ్, క్రీమీ ఛీజ్ పిజ్జా, చాకోలెట్ పిజ్జా అనే మూడు రకాలు దొరుకుతాయి. కారం ఎక్కువ తినలేని పిల్లలు, చాక్లెట్ ఇష్టపడే పిల్లలు వీటిని బాగా ఆర్డర్ చేస్తారని అన్నాడు ముఖేష్.

ఎవరీ ముఖేష్

ముఖేష్ అనంతపురం జిల్లా గుంతకల్ కి చెందినవాడు. ముఖేష్ కి ఇద్దరు అక్కలు. వాళ్లు హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. అందువల్ల ముఖేష్ హైదరాబాద్ లో  డిగ్రీ పూర్తిచేశాడు. ఆ క్రమంలో తమతో పాటే ఒకే కాంపౌండ్ లో  అద్దెకుంటున్న వనిత్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఆయన రెండో అక్క వనిత్ తో ప్రేమలో పడడం అది పెళ్లికి దారితీయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ క్రమంలోనే వనిత్, ముఖేష్ పిజ్జాను లోకలైజ్ చేయడం గురించి ఆలోచించారు. అది రకరకాల ప్రయోగాల తర్వాత సక్సెస్ అయింది. ఒక చిన్న ఐడియా చివరకు  దేశీపిజ్జా గా మారింది.  ఇప్పుడు ఈ  బిజినెస్ ప్రతి బ్రాంచ్ లో 36 లక్షల టర్నోవర్ తో నడుస్తుందని సంతోషంగా చెప్పుతాడు ముఖేష్. ఇంతరకు ముఖేష్ వయసెంతో తెలుసా… 26 యేళ్లు.

వనిత్

అలా మొదలయింది

ఈ ఆలోచన ఎలా వచ్చింది అని దేశీపిజ్జా ఓనర్ ముఖేష్ ను కదిలిస్తే ఏమీ లేదండీ చాలా సింపుల్ అంటూ సింపుల్ గా చెప్పుకొచ్చాడు. బిర్యానీలోనూ డబుల్ మసాలా కోరుకునే మనకు డొమినోస్, పిజ్జాహట్ పిజ్జాలు చప్పగా ఉండడం మామూలే కదా. మన నాలుక స్పైసీకి అలవాటు పడింది. అలాగని కొత్త రుచిని వదులుకోలేదు. దాంట్లోనూ ఇంకాస్త వెరైటీ ఉంటే బాగుండనుకుంటుంది. అలా చప్పగా ఉన్నాయన్న ఫీడ్ బ్యాక్ ఈ పిజ్జా తయారీకి మూలం అంటాడాయన.

నిజానికి ముఖేష్ బావ వనిత్ ఆలోచన ఇది. వనిత్ మాస్టర్ చెఫ్. కొంతకాలం సింగపూర్ లో, మరికొంత కాలం నావీలో … చెన్నై టు శ్రీలంక షిప్ లో మాస్టర్ చెఫ్ గా పనిచేశాడు. తనకున్న అనుభవంతో పిజ్జాకున్న ఫీడ్ బ్యాక్ తో కొత్తగా ఏదైనా చేద్దామన్న ఆలోచనతో మొదలుపెట్టిందే దేశీపిజ్జా. 2009లో ఈ ఆలోచనతో మొదటిసారిగా ఫిల్మ్ నగర్ లో దేవీపిజ్జా షాప్ ను ప్రారంభించారు.

పేరుకే కాదు రుచిలోనూ కొత్తగా ఉండడం వల్ల రెస్పాన్స్ బాగా వచ్చింది. రోజు రోజుకూ ఆర్డర్స్ పెరిగాయి. సినిమా వాళ్ల గిరాకీ బాగా వచ్చేది. అక్కడే బావతోపాటు షాపులో ఉన్నప్పుడు ఆ డిమాండ్ చూసిన ముఖేష్ మదిలో బ్రాంచ్ లు పెంచాలన్న ఆలోచన వచ్చింది. 

నాలుగు బ్రాంచ్ లతో జోరుగా వ్యాపారం

ఆలోచన వచ్చిందే ఆలస్యం ఎక్కడైతే బాగుంటుంది అని ఆలోచించారు. ఫిల్మ్ నగర్ తరువాత సినిమావాళ్లు ఎక్కువగా ఉండేది మణికొండ. అందుకే మణికొండలోని ఓయూ కాలనీలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. అలా  2014లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. అప్పటివరకు మా బావ వనిత్ తో కలిసి పనిచేసిన నేను ఈ బ్రాంచ్ తో ఓనర్ నయ్యాను. అప్పటినుండి ఇప్పటివరకు నేనే సొంతంగా రన్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు ముఖేష్.

ఈ బ్రాంచ్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఏవో కారణాల వల్ల ఫిల్మ్ నగర్ బ్రాంచ్ తీసేశారు. అయితేనేం, ఒకటి రెండుగా, రెండు నాలుగు బ్రాంచ్ లుగా విస్తరించాయని, నల్లగండ్ల, చందానగర్, మియాపూర్, ఓయూకాలనీల్లో దేశీపిజ్జా బ్రాంచ్ లు ఉన్నాయని చెప్పాడు ముఖేష్. వీటిల్లో నల్లగండ్ల బ్రాంచ్ ఏసీ స్టోర్ అని కూడా చెప్పాడాయన. మియాపూర్ లో రెనవేషన్ లో ఉందని త్వరలో కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని చెప్పాడు ముఖేష్.  వీటిల్లో రెండు తాను, రెండు తన బావ వనిత్ చూసుకుంటున్నామని చెప్పి ఆర్డర్స్ తీసుకోవడంలో మునిగిపోయాడు ముఖేష్.