కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సెంట్రల్ కౌన్సిలర్ ఫర్ ఇండియన్ మెడిసిన్ 2020 గెజిట్ నోటిపికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు దేశ వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. ఆయుర్వేద వైద్యంలో పీజీ పూర్తి చేసిన వారు 58 రకాల శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పిస్తూ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ నోటిఫికేషన్ ఇచ్చింది.

దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ రోజు ప్రైవేటు ఆసుపత్రుల బంద్కు పిలుపునిచ్చింది.
దీంతో దేశ వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర, కరోనా చికిత్సలు మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి. ఈ బంద్కు తెలంగాణ జూనియర్ డాక్లర్ల సంఘం కూడా మద్దతు తెలిపింది. దేశంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు అన్ని సాధారణ సేవలను నిలిపివేశారు.
ఆయుర్వేద వైద్యంలో పీజీ పూర్తి చేసిన వారికి శస్త్రచికిత్సలకు అనుమతి ఇస్తే వైద్యరంగంలో నకిలీ వైద్యులు పుట్టుకొస్తారని వైద్యులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, వారి డబ్బు వృథా అవుతుందని అంటున్నారు. ఏ వైద్యశాస్త్రానిక ఉండే ప్రాముఖ్యత దానికే ఉంటుందని, ఆయుర్వేద వైద్యులు అపరేషన్ చేస్తే ఆయుర్వేద మందులే ఇవ్వాలని ఐఎంఏ వాదిస్తోంది.
